
తెలంగాణలో ప్రస్తుతం ప్రయాణికుల కోసం శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఒక్కటే అందుబాటులో ఉంది. ఇక వరంగల్లో మామునూరు ఎయిర్పోర్ట్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు రాగా.. భూసేకరణ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఇక కొత్తగూడెం, రామగుండం ఎయిర్పోర్ట్లకు కేంద్రం నుంచి అనుమతులు రాగా.. ఇప్పుడు రాష్ట్రంలో మరో ఎయిర్పోర్ట్కు కూడా కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. అదే ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్. తాజాగా ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్పై కీలక ముందడుగు పడింది. ఈ ఎయిర్పోర్ట్ మాస్టర్ ప్లాన్కు కేంద్రం నుంచి అనుమతి రాగా.. ఎంపీ గోడం నరేష్ తాజాగా మస్టార్ ప్లాన్ను విడుదల చేశారు. త్వరలోనే భూసేకరణ పనులు ప్రారంభమవుతాయని తెలిపారు.
ఎమ్మెల్యే పాయల్ శంకర్తో కలిసి తన క్యాంపు కార్యాలయంలో ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ మాస్టర్ ప్లాన్ను ఎంపీ గోడం నగేష్ విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎయిర్ పోర్ట్ అధికారులు రంగంలోకి దిగాక మాస్టర్ ప్లాన్లో మార్పులు జరిగే అవకాశముందని తెలిపారు. జిల్లాను అభివృద్ది చేసే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని, ఇవాళ మాస్టర్ ప్లాన్ను విడుదల చేయడం ఆనందంగా ఉన్నారు. ఈ ఎయిర్పోర్ట్ అందుబాటులోకి వస్తే జిల్లా పారిశ్రామికంగా మరింత అభివృద్ది చెందుతుందన్నారు. ఇక్కడ ఇండస్ట్రీయల్ పార్క్ కోసం మరో 10 వేల ఎకరాలను గుర్తించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు వివరించారు.
త్వరలోనే ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ పనులు ప్రారంభమవుతాయని ఎంపీ గోడం నరేష్ తెలిపారు. ఇక్కడ ఎయిర్ పోర్ట్ రానుండటం జిల్లాల్లో ఒక చారిత్రాత్మక మైలురాయి అని, దశాబ్దాల జిల్లా ప్రజల కోరిక నెరవేరుతుందన్నారు. స్థానిక వ్యాపారులు, ప్రజలకు ఈ ఎయిర్ పోర్ట్తో ప్రయోజనం చేకూరుతుందన్నారు. అన్ని జిల్లాలతో కనెక్టివిటీ పెరగడం వల్ల ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయన్నారు. స్థానిక ప్రజల డిమాండ్ను నెరవేర్చడం కోసం నిరంతరం కృషి చేస్తున్నట్లు గోడం నగేష్ పేర్కొన్నారు. త్వరలోనే విమానయానశాఖ అధికారులు ప్రక్రియను వేగవంతం చేస్తారని పేర్కొన్నారు.