Telangana: పోలీసులే నిందితులైన వేళ.. సస్పెన్షన్‌లతో సతమతమవుతున్న డిపార్ట్‌మెంట్..!

| Edited By: Balaraju Goud

Mar 30, 2024 | 12:29 PM

తెలంగాణ పోలీస్ శాఖకు గ్రహణం పట్టింది. రక్షించాల్సిన పోలీసులే రాంగ్ రూట్​లోకి వెళుతున్నారు. రకరకాల కారణాలతో వివిధ హోదాల్లో ఉన్న పోలీసులు వివాదాల్లో చిక్కుకుంటున్నారు. యువతిపై అత్యాచారం, ప్రజాప్రతినిధి కుమారుడిని తప్పిన కేసు, ఫోన్ ట్యాపింగ్ కేసు, విధినిర్వహణలో అలసత్వం ఇలా తెలంగాణ పోలీస్ శాఖకు చెరగని మచ్చ తెచ్చిపెట్టాయి. మామూలు పోలీస్ నుంచి ఉన్నతాధికారుల వరకు సస్పెండ్, అరెస్టులు, ఏకంగా జైలు పాలవుతున్నారు.

Telangana: పోలీసులే నిందితులైన వేళ.. సస్పెన్షన్‌లతో సతమతమవుతున్న డిపార్ట్‌మెంట్..!
Telangana Police
Follow us on

తెలంగాణ పోలీస్ శాఖకు గ్రహణం పట్టింది. రక్షించాల్సిన పోలీసులే రాంగ్ రూట్​లోకి వెళుతున్నారు. రకరకాల కారణాలతో వివిధ హోదాల్లో ఉన్న పోలీసులు వివాదాల్లో చిక్కుకుంటున్నారు. యువతిపై అత్యాచారం, ప్రజాప్రతినిధి కుమారుడిని తప్పిన కేసు, ఫోన్ ట్యాపింగ్ కేసు, విధినిర్వహణలో అలసత్వం ఇలా తెలంగాణ పోలీస్ శాఖకు చెరగని మచ్చ తెచ్చిపెట్టాయి. మామూలు పోలీస్ నుంచి ఉన్నతాధికారుల వరకు సస్పెండ్, అరెస్టులు, ఏకంగా జైలు పాలవుతున్నారు. అసలు తెలంగాణ పోలీసు శాఖలో ఏం జరుగుతోందన్న చర్చ మొదలైంది..!

క్రమ శిక్షణకు మారుపేరుగా చెప్పుకునే పోలీస్‌ శాఖలో కొందరి తీరు కంచే చేను మేసిన చందంగా మారుతోంది. ఉన్నతాధికారుల హెచ్చరికలు, సస్పెన్షన్‌ చర్యలను కొందరు పోలీసులు పెడచెవిన పెడుతున్నారు. ఇంకొందరు బినామీ పేర్లతో కోట్లు గడిస్తూ దర్జాగా కాలం వెళ్ళదీస్తున్నారు. దొరికితే దొంగ.. లేదంట దొర అన్నట్లుగా మారింది. ఈ క్రమలో పలు వివాదాల్లో చిక్కుకున్న పోలీసులు సస్పెన్షన్ వేటుకు గురవుతున్నారు. దీంతో ఆ శాఖలో పెద్ద ఎత్తున ఖాళీలు విపరీతంగా ఏర్పడుతున్నాయి.

మహిళపై అత్యాచారం చేసిన కేసులో అప్పటి టాస్క్‌ఫోర్స్‌లో పని చేసిన మారేడుపల్లి ఇన్స్‌పెక్టర్ నర్సింగ్ రావు సస్పెన్షన్ వేటుకు గురై అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే! ఇక మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు కేసులో లక్షల రూపాయల లంచం తీసుకుంటూ పంజాగుట్ట ఇన్స్‌పెక్టర్ దుర్గారావు ఉద్యోగం పోగొట్టుకున్నారు. డ్యూటీలో నిర్లక్ష్యం సివిల్ మ్యాటర్‌లో తలదూర్చి సైబరాబాద్, హైదరాబాద్ కమిషనరేట్ పరధిలోని పలు పోలీస్ స్టేషన్లలో పని చేసిన సీఐలు, ఎస్ఐలు అధికారుల ఆగ్రహానికి గురై ఇంటి బాటపట్టారు.

ఇక ఫోన్ ట్యాపింగ్ కేసు అందరికి తెలిసిందే..! పోలీస్ అధికారి ప్రణీత్ రావు అరెస్ట్ నుండి మొదలుకుని, అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న జైలు పాలయ్యారు. తాజాగా ఆ లిస్టులోకి మాజీ టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ చేరారు. ఈ కేసులో ఇంకా చాలా మంది పోలీస్ అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. దర్యాప్తులో ఒక్కో పోలీస్ అధికారి విషయాలు బయటకు రావడంతో తెలంగాణలో అనేక ప్రాంతాల్లో ప్రస్తుతం డ్యూటీలో ఉన్న పోలీస్ బాస్ లు విచారణ ఎదురుకుంటున్నారు. ఇంకా ఎంత మంది అధికారులు అరెస్ట్ అవుతారో అర్ధం కాని పరిస్థితి నెలకొంది.

తాజాగా నయీమ్ కేసుపై కూడా పోలీస్ ఉన్నతాధికారులు ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇక ఈ కేసు కూడా ఇన్వెస్టిగేషన్ మొదలైతే చెప్పాల్సిన పని లేదు.. అప్పట్లో నయీమ్‌తో చెట్టాపట్టాలేసుకుని అక్రమ ఆస్తులు కూడాబెట్టారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి కష్టకాలమేనట. సస్పెండ్‌కు గురై మళ్ళీ క్లిన్ చిట్ తో డ్యూటీలో జాయిన్ అయిన అధికారులను మరోసారి విచారించేందుకు పోలీస్ యంత్రాంగం సిద్ధమవుతుందట. ఇలా అనేక అవినీతి, నేర కేసుల్లో పోలీస్ బాసులు జైలుకు వెళ్లడం, జాబ్ పోగొట్టుకోవడం కలవరానికి గురి చేస్తోంది. దీంతో ఆయా పోస్టులకు ఖాళీలు కూడా ఏర్పడుతోంది. భవిష్యత్తులో పోలీస్ శాఖ ఇంకా ఎంత అప్రతిష్ట మూట కట్టుకుంటుందో అని జనం విమర్శలు గుప్పిస్తున్నారు. వడ్డించే వాడు మనవాడు అని తెలిసి అడ్డగోలుగా తింటే అజీర్తి అవ్వడం ఖాయం అంటూ మరికొందరు కరెప్టెడ్ పోలీసులపై కామెంట్లు చేస్తున్నారు. ఏదిఏమైనా జరుగుతున్న పరిణామాలు అరెస్ట్ అవుతున్న పోలీస్ అధికారుల పరిస్థితి చూస్తే చట్టం ఎవరికి చుట్టం కాదు అన్న మాట నిజంలా అనిపిస్తోంది..!

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…