
కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఏడు హైస్పీడ్ బుల్లెట్ రైళ్ల కారిడార్లను బడ్జెట్లో ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ఇందులో హైదరాబాద్ నుంచి మూడు కారిడార్లను ప్రకటించింది. హైదరాబాద్-ముంబై, హైదరాబాద్-చెన్నై, హైదరాబాద్-బెంగళూరు ప్రాజెక్టులను నిర్మించనుంది. అయితే ఈ మూడు కారిడార్లకు సంబంధించి శంషాబాద్లో బుల్లెట్ ట్రైన్ హబ్ ఏర్పాటు కానుంది. ఇంటిగ్రేటెడ్ మొబిలిటీ హబ్ పేరుతో దీనిని నిర్మించనున్నారు. ఎయిర్ పోర్ట్ సమీపంలోని బహదూర్గూడలో ఈ మెగా హబ్ కోసం భూమిని సేకరించేందుకు రంగం సిద్దమైంది. ఈ ప్రాంతంలో 796.28 ఎకరాల భూమిని సేకరించేందుకు రెవెన్యూ అధికారులు సిద్దమయ్యారు. ఇందుకు సంబంధించి అనుమతి జారీ చేస్తూ కలెక్టర్ సి.నారాయణరెడ్డి ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేశారు.
ఈ మూడు కారిడార్లకు అనుసంధానంగా ఈ హబ్ ఉండనుంది. ట్రైన్ల రాకపోకలు, నిర్వహణ, కార్యకలాపాలను ఈ హబ్ ద్వారా నిర్వహిస్తారు. దీంతో బుల్లెట్ ట్రైన్ల నిర్వహణకు ఈ హబ్ కీలకంగా మారనుంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో బుల్లెట్ ట్రైన్ హబ్ ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. దీనికి అనుగుణంగా భూసేకరణ చేపట్టాలని ఆదేశించారు. దీంతో రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగారు. శంషాబాద్-తుక్కుగూడ ఔటర్ సర్వీస్ రోడ్కు సమీపంలోని బహదూర్గూడలో 750 ఎకరాల ప్రభుత్వ భూమిని ఇందుకోసం ఉపయోగించుకోనున్నారు. అలాగే ఇక్కడ 46.28 ఎకరాల పట్టాభూమిని త్వరలో సేకరించనున్నారు. బహదూర్గూడలో సర్వే నంబరు 62, 28లలో 750 ఎకరాల ప్రభుత్వ భూములున్నాయి. దీంతో బుల్లెట్ ట్రైన్ హబ్ కోసం ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కూడా కూతవేటు దూరంలో ఉండటంతో ఎయిర్పోర్ట్, బుల్లెట్ ట్రైన్లను అనుసంధానించేందుు వీలు కలుగుతుంది. బుల్లెట్ రైళ్ల కారిడార్లను ఎయిర్పోర్టుతో అనుసంధానించనున్నారు.
శంషాబాద్ ఇప్పటికే రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్), ఫ్యూచర్ సిటీ వంటి ప్రాజెక్టులతో అభివృద్ది దిశగా దూసుకెళ్తుంది. వీటికి హై-స్పీడ్ రైల్ నెట్వర్క్ కూడా తోడైతే.. శంషాబాద్ రైలు, రోడ్డు, విమాన మార్గాలను సమన్వయం చేసే ఒక మెగా మల్టీమోడల్ ట్రాన్స్పోర్ట్ హబ్గా రూపుదిద్దుకోనుంది. ఇది దక్షిణ భారతదేశానికే ఒక ముఖ్యమైన రవాణా, వాణిజ్య కేంద్రంగా మారే అవకాశం ఉందని చెప్పవచ్చు. బుల్లెట్ రైళ్లు కేవలం ప్రయాణ సమయాన్ని తగ్గించడమే కాకుండా.. పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు, లాజిస్టిక్స్, ప్రాంతీయ అభివృద్ధిని ప్రోత్సహిస్తాయి. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా శంషాబాద్, పరిసర ప్రాంతాల్లో గణనీయమైన వృద్ధి నమోదయ్యే అవకాశం ఉందని చెప్పవచ్చు. అలాగే హైదరాబాద్ రవాణా ముఖచిత్రం కూడా బుల్లెట్ రైళ్ల రాకతో పూర్తిగా మారనుంది