
హైదరాబాద్ మణికొండలో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య కలకలం రేపుతుంది. శ్రేయ అనే స్టూడెంట్ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మణికొండలోని శ్రీరామ్నగర్ కాలనీలో నివాసముంటున్న శ్రేయ, ఇబ్రహీంబాగ్లోని వాసవి ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ సెకండియర్ చదువుతుంది. శ్రేయ ఫస్ట్ ఇయర్ చదువుతున్న సమయంలో నిర్వహించిన పరీక్షల్లో, తనకు తెలియకుండానే హాల్లోకి సెల్ఫోన్ తీసుకెళ్లింది. తాను కావాలని తీసుకురాలేదని, పొరపాటు జరిగిందని ఫ్యాకల్టీని ఎంతగానో బతిమాలినప్పటికీ వారు వినకుండా ఆమెను పరీక్షల నుంచి డీబార్ చేశారని కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే ఆ ఘటనతోనే సమస్య ముగిసిపోలేదు. సెకండ్ ఇయర్ ప్రారంభమైనప్పటి నుంచి శ్రేయను కాలేజీ సిబ్బంది టార్గెట్ చేయడం మొదలుపెట్టినట్లు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో శ్రేయ రాసిన సూసైడ్ నోట్ అందరినీ కంటతడి పెట్టిస్తుంది.
‘‘నీకు సిగ్గు, శరం ఉండవు.. కొన్ని జీవితాలు ఎప్పటికీ మారవు’’ అంటూ ఓ అధ్యాపకురాలు క్లాస్లో అందరి ముందూ దారుణంగా మాట్లాడేవారని నోట్లో శ్రేయ వివరించింది. మరొకరేమో ఈసారి ఎగ్జామ్స్లో నువ్వే దొరుకుతావని అనుకుంటే, వేరేవాళ్లు దొరికారు’’ అంటూ నిత్యం ఎత్తిపొడుపు మాటలతో వేధించారని.. ఇలా గత మూడు నెలలుగా కాలేజీలో నిరంతరం జరుగుతున్న అవమానాలు, సూటిపోటి మాటలను భరించలేక కఠిన నిర్ణయం తీసుకుంది. ‘‘అమ్మ, నాన్న.. నన్ను క్షమించండి, నేను చనిపోతున్నా. కాలేజీలో వేధింపులు నేను భరించలేకపోతున్నా.. నా చావు వార్త కాలేజీ వాళ్లకు తెలియనివ్వకండి.. నా చావు చూసి వాళ్లు బాధపడరు.. సంతోషిస్తారు’’ అని రాసిన వ్యాఖ్యలు ప్రతి ఒక్కరినీ తీవ్రంగా కలచివేస్తున్నాయి.
సమాచారం అందుకున్న నార్సింగి పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకున్నారు. ఉన్నత చదువులు చదివి ఉన్నత స్థాయికి చేరుకుంటుందని ఆశపడ్డ కూతురు ఇలా ఆత్మహత్యకు పాల్పడటంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు గుండెలు అవిసేలా రోదిస్తున్నారు. తమ కూతురు మరణానికి కారణమైన కళాశాల అధ్యాపకులు, యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.