నడిరోడ్డుపైనే డాక్టర్‌పై హత్యాయత్నం! ఇనుపరాడ్లతో దాడి.. వరంగల్‌లో దారుణ ఘటన

కొంత మంది వ్యక్తులు రోడ్డుపై వెళ్తున్న ఓ కారు అడ్డుకొని, అందులో ప్రయాణిస్తున్న వ్యక్తిపై అత్యంత దారుణంగా దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి డాక్టర్‌ అని పోలీసులు గుర్తించారు. ఈ ఘటనతో ఒక్కసారిగా వరంగల్‌ నగరం ఉలిక్కిపడింది. ఇంతకీ డాక్టర్‌పై దాడి ఎందుకు జరిగింది? ఎవరు చేశారనే విషయాలపై విచారణ సాగుతోంది.

నడిరోడ్డుపైనే డాక్టర్‌పై హత్యాయత్నం! ఇనుపరాడ్లతో దాడి.. వరంగల్‌లో దారుణ ఘటన
Warangla Crime

Updated on: Feb 21, 2025 | 7:11 AM

నడిరోడ్డుపైనే ఓ వ్యక్తిపై కొంతమంది దుండగులు ఇనుపరాడ్లతో హత్యాయత్నానికి పాల్పాడ్డారు. ఈ ఘటన వరంగల్‌ జిల్లాలో చోటు చేసుకుంది. దాడిలో గాయపడిన వ్యక్తిని డాక్టర్‌ గాదె సిద్ధార్థ్‌ రెడ్డిగా పోలీసులు గుర్తించారు. కారులో వెళ్తున్న సిద్ధార్థ్‌ రెడ్డిని అడ్డగించి, ఆయనను కారు నుంచి బయటికి లాగి ఇనుపరాడ్లతో విచక్షణారహితంగా దాడిచేశారు. వరంగల్ – బట్టుపల్లి మధ్య ప్రధాన రహదారిపై కాపు కాసిన దుండగులు ఆయన కారు వస్తుందని గమనించి, కారు ఆపి ఈ దాడికి తెగబడ్డారు. ఆయనను విపరీతంగా కొట్టి.. అక్కడ నుంచి పారిపోయారు.

స్థానికులు ఇచ్చిన సమాచారంతో కొన ఊపిరితో కొట్టు మిట్టాడుతున్న బాధితుడ్ని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. అయితే దాడికి పాల్పడిన వారు ఎవరు? ఎందుకు సిద్ధార్థ్‌ రెడ్డిని చంపాలని అనుకున్నారనే విషయాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు విచారణ చేసిన తర్వాత ఈ ఘటనపై మరింత సమాచారం. తెలిసే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సిద్ధార్థ్‌ రెడ్డి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వీలైనంత త్వరగా నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.