
Bonalu: తెలంగాణలో నేటి నుంచి ఆషాఢమాసం బోనాలు ప్రారంభం కానున్నాయి. ఇవాళ గోల్కొండ జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించనున్నారు. ఇప్పటికే బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం భావించిన దరిమిలా.. అధికారులు సైతం ఆ మేరకు ఏర్పాట్లు చేశారు. ఉత్సవాల్లో భాగంగా లంగర్హౌస్ నుంచి తొట్టెల ఊరేగింపు జరగనుంది. బగ్గీపై ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పణ సమర్పిస్తారు. అమ్మవారికి పట్టువస్త్రాలను మంత్రులు ఇంద్రకరణ్, తలసాని శ్రీనివాస్ సమర్పించనున్నారు. కాగా, ఇవాళ్టి నుంచి వచ్చే నెల 8వ తేదీ వరకు హైదరాబాద్లో బోనాల ఉత్సవాలు జరుగనున్నాయి. ప్రతి గురువారం, ఆదివారం అమ్మవార్లకు భక్తులు బోనాలు సమర్పిస్తారు.
ఇదిలాఉంటే.. బోనాల పండుగ ప్రారంభం సందర్భంగా తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. బోనాల ఉత్సవాలు తెలంగాణ సబ్బండ వర్ణాల గంగా జమునా తెహజీబ్ కు ప్రతీక గా నిలుస్తాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అమ్మవారి దీవెనతో, ప్రభుత్వ పట్టుదలతో.. తెలంగాణ రాష్ట్రం దేశానికే భోజనం పెట్టే అన్నపూర్ణగా మారిందన్నారు. తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో సుభిక్షంగా జీవించేలా అమ్మవారి ఆశీస్సులు కలకాలం కొనసాగాలని సీఎం కేసీఆర్ ప్రార్థించారు.
విజయవాడ దుర్గమ్మకు ఆషాఢ సారె..
మరోవైపు ఆషాడ మాసం సందర్భంగా ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయంలో ఆషాఢ సారె ప్రారంభమైంది. దుర్గమ్మను తమ ఆడపడుచుగా భావించి భక్తులు అమ్మవారికి ఆషాడం సారెను సమర్పించనున్నారు. పూలు, పళ్లు, గాజులు, చీరతో పాటు చలిమిడితో కూడిన సారెను.. మేళ తాళాలు, మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారికి సారె సమర్పించనున్నారు. కాగా, ఆయలం తరఫున అమ్మవారికి మొదటి సారెను రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సమర్పించనున్నారు.
Also read: