TSRTC: ఆంధ్ర వెళ్లాలనుకునే వారికి షాకింగ్ న్యూస్.. ఏపీకి బస్సులు నిలిపేసిన టీఎస్ ఆర్టీసీ.. అక్కడి వరకే పరిమితం..!

|

May 05, 2021 | 10:00 PM

తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్​కు నడిపే ఆర్టీసీ బస్సులను నేటి నుంచి నిలిపివేస్తున్నట్లు టీఎస్​ ఆర్టీసీ ప్రకటించింది. ఏపీలో కర్ఫ్యూ కొనసాగుతున్న దృష్ట్యా... కేవలం రాష్ట్ర సరిహద్దుల వరకు మాత్రమే బస్సులు నడుపుతున్నామని వెల్లడించింది.

TSRTC: ఆంధ్ర వెళ్లాలనుకునే వారికి షాకింగ్ న్యూస్.. ఏపీకి బస్సులు నిలిపేసిన టీఎస్ ఆర్టీసీ.. అక్కడి వరకే పరిమితం..!
Follow us on

tsrtc stopped bus services: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఏపీ సర్కార్ పాక్షిక లాక్‌డౌన్ విధించింది. దీంతో తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్​కు నడిపే ఆర్టీసీ బస్సులను నేటి నుంచి నిలిపివేస్తున్నట్లు టీఎస్​ ఆర్టీసీ ప్రకటించింది. ఏపీలో కర్ఫ్యూ కొనసాగుతున్న దృష్ట్యా… కేవలం రాష్ట్ర సరిహద్దుల వరకు మాత్రమే బస్సులు నడుపుతున్నామని వెల్లడించింది. ఏపీలో పరిస్థితులను బట్టి… తిరిగి ఎప్పుడు బస్సులను పునరుద్ధరిస్తామో ప్రకటిస్తామని ఆర్టీసీ అధికారులు తెలిపారు.

కరోనా రెండో దశ ఉద్ధృతితో… ఆంధ్రప్రదేశ్​లో కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి మరుసటిరోజు తెల్లవారుజామున ఐదు గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతోంది. ప్రజారవాణా వ్యవస్థను సైతం నిలిపివేసింది ఏపీ సర్కార్. కర్ఫ్యూ మినహా మిగిలిన కొన్ని గంటల వ్యవధిలో ప్రయాణించేవారు తక్కువగా ఉంటారని.. బస్సులు నడిపినప్పటికీ నష్టాలు చవిచూడాల్సి వస్తుందని టీఎస్​ ఆర్టీసీ భావించింది. కర్ఫ్యూ పరిస్థితి సద్దుమణిగే వరకు బస్సులను తిప్పకపోవడమే మంచిదని అధికారులు నిర్ణయించారు. కర్ఫ్యూ కారణంగా ఏపీకి చెందిన ఆర్టీసీ బస్సులు, తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లాల్సిన ఆర్టీసీ బస్సులు ఎంజీబీఎస్ బస్​స్టేషన్​లోనే నిలిపివేశారు.

ఇదిలావుంటే, రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నిత్యం 1400 1500 వరకు అంతరాష్ట్ర ఆర్టీసీ సర్వీసులు ప్రయాణికులను చేరవేస్తుంటాయి. వీటితో పాటు ప్రైవేట్ సర్వీసులు సుమారు 900 వరకు రాకపోకలు సాగిస్తుంటాయి. ఇవీ కాకుండా క్యాబ్‌లు, ఆటోలు వేలాదిగా తిరుగుతుంటాయి. ఆంక్షల అమలుతో ప్రజా రవాణా పూర్తిగా నిలిచిపోయింది. అయితే, సరిహద్దు జిల్లాలైన నల్గొండ, ఖమ్మం జిల్లాలకు చెందిన బస్సులను మాత్రం యథావిధిగా నడిపిస్తున్నారు. ఈ బస్సులు రాష్ట్ర సరిహద్దు వరకు వెళ్తాయని ఆర్టీసీ అధికారులు తెలిపారు.

లాక్​డౌన్ తర్వాత కోలుకుని రోజువారి ఆదాయం రూ.11 కోట్లకు పైగా… వస్తున్న తరుణంలో ఏపీలో కర్ఫ్యూతో పాటు, తెలంగాణలో రాత్రి కర్ఫ్యూ విధించడం వల్ల నైట్ సర్వీసులు ప్రయాణికులు లేక నిలిపివేయాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో ఆర్టీసీకి వచ్చే ఆదాయం సగానికి సగం పడిపోయిందని ఆర్టీసీ అధికారులు అంచనావేస్తున్నారు. ఓఆర్ 40 శాతానికి పడిపోయినట్లు లెక్కలు వేస్తున్నారు. రాత్రి సర్వీసులు నిలిపివేయడం వల్ల రూ.50 లక్షల నుంచి రూ.70 లక్షల వరకు నష్టం వాటిల్లుతున్నట్లు అధికారుల అంచనా వేస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థపై మరింత భారం పడే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.

Read Also…. AP Curfew : తొలిరోజు ఏపీ కర్ఫ్యూలో “సిత్రాలు”.. బంగారం, మందు, మాంసం దుకాణాలపై ఎగబడ్డ జనం.. రాష్ట్ర సరిహద్దులు మూసివేత