Sabitha Indra Reddy: త్వరలో విద్యా సంవత్సరం ప్రకటన.. పాఠశాలల యాజమాన్యాలతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి

|

Jan 19, 2021 | 6:49 PM

Sabita Indra Reddy: తెలంగాణలోని పాఠశాలలు, కళాశాలల విద్యా సంవత్సరాన్ని త్వరలో ప్రకటించనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఫిబ్రవరి..

Sabitha Indra Reddy: త్వరలో విద్యా సంవత్సరం ప్రకటన.. పాఠశాలల యాజమాన్యాలతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి
Follow us on

Sabitha Indra Reddy: తెలంగాణలోని పాఠశాలలు, కళాశాలల విద్యా సంవత్సరాన్ని త్వరలో ప్రకటించనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఫిబ్రవరి 1 నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో మంగళవారం మంత్రి ప్రైవేటు పాఠశాలలు, జూనియర్‌, డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్‌ కళాశాలల యాజమాన్యాల ప్రతినిధులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ప్రతినిధులకు పలు సూచనలు, సలహాలు చేశారు. పాఠశాలలు పునః ప్రారంభించడానికి సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. ఈ సందర్భంగా 14 డిమాండ్లను పరిష్కరించాలని పాఠశాలల ప్రతినిధులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. అంచెలంచెలుగా అన్ని తరగతులను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఏడాదిగా ఫీజులు లేనందున పాఠశాలల నిర్వహణ కష్టతరంగా మారిందని యాజమాన్యాలు మంత్రి దృష్టికి తీసుకువచ్చాయి. జూన్‌ వరకు విద్యా సంవత్సరం నిర్వహించాలని, కనీస హాజరు ఉండేలా నిబంధన పెట్టాలని కొన్ని పాఠశాలల యాజమాన్యాలు మంత్రి దృష్టికి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది.

కాగా, సమావేశం అనంతరం మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ విద్యాబోధన చేపట్టాలన్నారు. వివిధ తరగతుల్లో సిలబస్‌ తగ్గింపుపై త్వరలోనే స్పష్టమైన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ప్రైవేటు పాఠశాలలు ప్రారంభించేందుకు సిద్ధం కావాలని, ఇందుకు తల్లిదండ్రులు కూడా సహకరించాలని మంత్రి కోరారు. కరోనాపై అవగాహన కల్పిస్తూ విద్యార్థుల ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె సూచించారు.

అయితే విద్యార్థులు పాఠశాలలకు హాజరు కావాలంటే తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి అని గతంలో ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని గుర్తు చేశారు. ఒక వేళ పాఠశాలలకు హాజరు కాని విద్యార్థులకు ఆన్‌లైన్‌లో క్లాసులు వినేలా చూడాలని పాఠశాలల యాజమాన్యాలకు మంత్రి సూచించారు.

Also Read: Bowenpally Kidnap Case: బోయినపల్లి కిడ్నాప్ కేసులో జగత్ విఖ్యాథ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ .. రేపు విచారణ