
వాహనదారులకు ఏపీ ప్రభుత్వం భారీ శుభవార్త తెలిపింది. ఇకపై 24 గంటల్లోనే వెహికల్ రిజిస్ట్రేషన్ జరిగేలా తాజాగా కొత్త విధానం అమల్లోకి తెచ్చింది. జూన్ 5వ తేదీ నుంచి ఈ కొత్త సిస్టమ్ అమల్లోకి తెచ్చినట్లు ప్రకటన చేసింది. ఈ విధానం ద్వారా తొలుత మీరు వెహికల్ కొనగానే డీలర్ వద్దనే తాత్కాలిక రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. అనంతరం అక్కడ నుంచి రవాణాశాఖకు ఆన్లైన్ ద్వారా మీ దరఖాస్తు వెళుతుంది. అధికారులు పరిశీలించి శాశ్వత రిజిస్ట్రేషన్కు ఆమోదం తెలిపారు. ఒకవేళ అధికారులు 24 గంటల్లో పూర్తి చేయకపోతే ఆటోమేటిక్గా ఆమోదం లభించేలా కొత్త సిస్టమ్ రూపొందించారు. దీని ద్వారా సాఫ్ట్వేర్ ఆటోమేటిక్గా ఆమోదం తెలుపుతుంది.
వెహికల్ రిజిస్ట్రేషన్లలో జరుగుతున్న జాప్యానికి చెక్ పెట్టేందుకు ఏపీ ప్రభుత్వం ఈ కొత్త విధానం రూపొందించింది. ప్రస్తుతం ఉన్న విధానంలో రిజిస్ట్రేషన్ కోసం చాలా ఆలస్యమవుతోంది. చాలా రోజుల వరకు వాహనాలు కొత్తగా కొనుగోలు చేసినవారు వెయిట్ చేయాల్సి వస్తోంది. దీని వల్ల వాహనదారుల సమయం, డబ్బు వృధా అవుతుంది. రోజుల తరబడి రవాణాశాఖ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. దీంతో వాహనదారులు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం కొత్త విధానం అమలు చేస్తోంది. ఇటీవల సీఎం చంద్రబాబు రవాణశాఖపై సచివాలయంలో కీలక సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై సుదీర్ధంగా అధికారులతో చర్చించారు. అనంతరం 24 గంటల్లోనే ఆన్ లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ జరిగేలా కొత్త విధానం తీసుకురావాలని ఆదేశించారు. దీంతో అధికారులు ఇప్పుడు దానిని అమల్లోకి తీసుకొచ్చారు.
ప్రస్తుతం ఉన్న విధానంలో సెలవు రోజుల్లో రవాణా సేవలు పూర్తిగా నిలిచిపోతున్నాయి. వరుసగా సెలవులు వస్తే రిజిస్ట్రేషన్ కోసం రోజుల సమయం పడుతుంది. ఆదివారం, సెలవు రోజుల్లో ప్రభుత్వ ఆఫీసులు ఉండవు. దీంతో సెలవు రోజుల్లో కూడా ఆన్లైన్ ద్వారా అధికారులు ఆమోదం తెలిపేలా ఆన్లైన్ వ్యవస్థ తీసుకొచ్చారు. ఇక రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగంగా జరిగేలా షోరూం డీలర్లకు కూడా ప్రభుత్వం ప్రత్యేక సూచనలు చేసింది. టెంపలరీ రిజిస్ట్రేషన్ చేసే సమయంలో డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉన్నాయా.. లేదా అనేది సరిగ్గా చెక్ చేయాలని సూచించింది. ఇక రిజిస్ట్రేషన్లలో జాప్యం జరగకుండా ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని సూచించింది. ఈ కొత్త విధానం వల్ల తాత్కాలిక రిజిస్ట్రేషన్లతో వాహనాలు రోజుల తరబడి రోడ్లపై తిరిగే అవకాశం ఉండదు.