Krishna River water disputes: రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న జలవివాదం నేపథ్యంలో మరోసారి సమావేశం జరగనుంది. కృష్ణానదీ యాజమాన్య బోర్డు ఈనెల 25న సమావేశం కానుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య నీటి కేటాయింపులపై చర్చించేందుకు బోర్డు సమావేశం జరగనుంది. జూన్ 1 నుంచి కొత్త నీటి సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో నీటి లభ్యత అంచనా, కేటాయింపులు తదితర అంశాలను ఈ సందర్భంగా చర్చకు రానున్నాయి. కాగా, మిగులు జలాలను ఎలా వినియోగించుకోవాలన్న అంశంపై గతేడాది నుంచీ చర్చ నడుస్తోంది. దీనిపై ప్రత్యేక కమిటీని నియమించినప్పటికీ సమస్య కొలిక్కి రాలేదు. అదేవిధంగా.. కొత్త ప్రాజెక్టుల నిర్మాణంపై ఇరు రాష్ట్రాలు పరస్పరం ఫిర్యాదు చేసుకోవడంతో.. కేంద్రప్రభుత్వం డీపీఆర్లను సమర్పించాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు సూచించింది. ఈనెల 25న జరిగే సమావేశంలో ఈ అంశాలకు సంబంధించి కూడా చర్చించనున్నారు. అయితే, కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశం జరుగనున్నట్లు తెలుస్తోంది.