Telangana: ప్రచారం ఆపాలన్న పోలీస్‌.. అక్బరుద్దీన్‌ మాస్‌ వార్నింగ్‌.. ఆ తరువాత ఏమైందంటే..

తెలంగాణలో పోలింగ్‌కు సమయం దగ్గర పడుతున్న వేళ కొన్ని పార్టీలు తమ ప్రచారంలో దూకుడు పెంచాయి. వరుస బహిరంగ సభలు, రోడ్‌ షోలతో ఓటర్లకు మరింత దగ్గరయ్యేందుకు ప్రణాళికలు రూపొందించుకుంటున్నాయి. అటు పాతబస్తీలోనూ ఎంఐఎం ప్రచారంలో దూకుడు మీద ఉంది. ఒవైసీ బ్రదర్స్‌ క్షణం తీరికలేకుండా సభలు, సమావేశాలతో హోరెత్తిస్తున్నారు. అయితే ఓ ప్రచార కార్యక్రమంలో అనుకోని సంఘటన ఎదురైంది.

Telangana: ప్రచారం ఆపాలన్న పోలీస్‌.. అక్బరుద్దీన్‌ మాస్‌ వార్నింగ్‌.. ఆ తరువాత ఏమైందంటే..
Akbaruddin Owaisi

Edited By:

Updated on: Nov 22, 2023 | 8:06 AM

తెలంగాణలో పోలింగ్‌కు సమయం దగ్గర పడుతున్న వేళ కొన్ని పార్టీలు తమ ప్రచారంలో దూకుడు పెంచాయి. వరుస బహిరంగ సభలు, రోడ్‌ షోలతో ఓటర్లకు మరింత దగ్గరయ్యేందుకు ప్రణాళికలు రూపొందించుకుంటున్నాయి. అటు పాతబస్తీలోనూ ఎంఐఎం ప్రచారంలో దూకుడు మీద ఉంది. ఒవైసీ బ్రదర్స్‌ క్షణం తీరికలేకుండా సభలు, సమావేశాలతో హోరెత్తిస్తున్నారు. అయితే ఓ ప్రచార కార్యక్రమంలో అనుకోని సంఘటన ఎదురైంది. సమయానికి ముందే ప్రచారం ముగించాలని అడ్డుకోబోయిన ఇన్‌స్పెక్టర్‌పై ఎంఐఎం కీలక నేత అక్బరుద్దీన్‌ ఒవైసీ మండిపడ్డారు.

హైదరాబాద్‌ పాతబస్తీలోని చంద్రాయణగుట్ట నియోజకవర్గం సంతోష్‌నగర్‌ పీఎస్‌ పరిధిలో ఎంఐఎం అభ్యర్థి అక్బరుద్దీన్‌ ఒవైసీ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇంతలో అక్కడికి వచ్చిన సంతోష్‌నగర్‌ ఇన్‌స్పెక్టర్‌ పి.శివచంద్ర ప్రచార సమయం అయిపోయింది, ఇక ప్రసంగం ముగించాలని అక్బరుద్దీన్‌ ఒవైసీకి చెప్పారు. దీంతో ఒక్కసారిగా అక్బరుద్దీన్‌కు కోపం వచ్చింది. ప్రచార సమయానికి ఇంకా ఐదు నిమిషాలు ఉందని, ముందే ప్రచారాన్ని ఎలా ఆపుతారంటూ ఇన్‌స్పెక్టర్‌పై కన్నెర్ర చేశారు. అంతేకాకుండా స్టేజ్‌ మీద నుంచి దిగి సీరియస్‌గా ఇన్‌స్పెక్టర్‌ శివచంద్రవైపు వెళ్లారు. అంతేకాకుండా మాస్‌ వార్నింగ్‌ ఇచ్చారు.

మీ దగ్గర గడియారం లేకపోతే నా వాచ్‌ని మీకిస్తా టైమ్‌ చూసుకోండంటూ ఊగిపోయారు. అంతేకాకుండా తనపై తూటాలు, కత్తులతో దాడులు జరిగాయని.. అంతమాత్రాన అలసిపోయానని అనుకుంటున్నారా అంటూ ధ్వజమెత్తారు. తాను ఇప్పటికీ ఎంతో ధైర్యంగా, బలంగా ఉన్నానని, దయచేసి రెచ్చగొట్టొద్దంటూ చెప్పుకొచ్చారు. ఇన్‌స్పెక్టర్‌ వైపు చూస్తూ.. పెద్ద ఏదో చెప్పడానికి వచ్చి నిలబడ్డావ్‌, ఐదు నిమిషాలు ఇంకా సమయం ఉందని, ఖచ్చితంగా తాను మాట్లాడి తీరునానన్నారు. తనను ఆపే ధైర్యం ఎవరికీ లేదు.. ఉండబోదని అక్బరుద్దీన్‌ తెగేసి చెప్పారు. అంతటి ఆగకుండా తాను చంద్రాయణగుట్ట నియోజకవర్గ ప్రజలకు ఒక్క సైగ చేస్తే పోలీసులంతా ఇక్కడి నుంచి పరుగులు పెడతారని హెచ్చరించారు. పరుగెత్తించి చూపించమంటారా అని పోలీసులను ఉద్దేశించి ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి

చంద్రాయణగుట్ట నియోజకవర్గంలో నాకు పోటీ అభ్యర్థులు ఎవరూ లేరు కాబట్టి ఈ ఇన్‌స్పెక్టర్‌ అభ్యర్థిలా ఇక్కడి వచ్చి నన్ను ప్రశ్నిస్తున్నారా అని ఎద్దేవా చేశారు. దమ్ముంటే వచ్చి ఎన్నికల్లో పోటీ చేయాలంటూ పోలీస్‌ అధికారికి సవాల్‌ విసిరారు. ఈ ఎన్నికల్లో ఒవైసీ బ్రదర్స్‌ ఎక్కడ బహిరంగ సభలు, సమావేశాలు ఏర్పాటు చేసినా ముందస్తుగా అధికారుల అనుమతులు తీసుకుంటూ సమయానికే ముగిస్తున్నారు. అంతేకాకుండా ఎన్నికల కోడ్‌ను ఎక్కడా ఉల్లంఘించడం లేదు. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించొద్దంటూ తమ పార్టీ నేతలు, కార్యకర్తలకు ఒవైసీ బ్రదర్స్‌ హెచ్చరికలు కూడా జారీ చేస్తూ వస్తున్నారని ఎంఐఎం నేతలు చెబుతున్నారు. కొందరు అధికారులు అత్యుత్సాహంతో వ్యవహరిస్తున్నారని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నారని, ఎన్నికల కోడ్‌ పరిధిలోనే ప్రచారం చేసుకుంటున్న తమను రెచ్చగొట్టొద్దని ఎంఐఎం నేతలు హెచ్చరిస్తున్నారు.

 

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..