Hyderabad: చూడ్డానికి డీసెంట్గా ఉన్నాడని అమాయకుడు అనుకోవద్దు.. ఏం చేశాడో తెలిస్తే ఫ్యూజులెగరాల్సిందే!
పెరుగుతున్న టెక్నాలజీని వాడుకొచి కొందరు అద్భుతాలు సృష్టిస్తుంటే.. మరికొందరు కేటాగాళ్లు మాత్రం జనాలను నిండా ముంచుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే హైదరాబాద్లో వెలుగు చూసింది. ఏఐ సాయంతో ఆర్మీ అధికారినని చెప్పి ఓ మహిళను మోసం చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంతకూ అతను ఏం చేయాలో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

టెక్నాలజీ దుర్వినియోగం చేస్తూ ఏఐ సాయంతో సృష్టించిన ఫొటోలను ఉపయోగించి తాను భారత ఆర్మీలో అధికారి అని నమ్మించి ఓ మహిళను మోసం చేసిన యువకుడిని నాగోల్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం, షామీర్పేటకు చెందిన 29 ఏళ్ల ముకేరా గోవర్ధన్ సోషల్ మీడియా ద్వారా నాగోల్లోని ఆనంద్నగర్కు చెందిన ఓ మహిళతో పరిచయం పెంచుకున్నాడు. తనను భారత సైన్యంలో అధికారిగా నమ్మించేందుకు ఏఐ సాయంతో రూపొందించిన ఆర్మీ యూనిఫాం ఫొటోలను ఆమెకు పంపించాడు. దీంతో అతడిని నిజంగానే ఆర్మీ అధికారిగా భావించిన మహిళ అతడిని నమ్మింది.
కొద్ది నెలల తర్వాత ఇద్దరూ కలిసి నివసించడం ప్రారంభించారు. ఈ క్రమంలో ఆమెను త్వరలో పెళ్లి చేసుకుంటానని గోవర్ధన్ హామీ ఇచ్చాడు. అనంతరం తన తండ్రి అనారోగ్యంతో ఉన్నారని, వైద్య చికిత్స కోసం అత్యవసరంగా డబ్బు అవసరమని చెప్పి బాధితురాలి నుంచి భారీ మొత్తంలో నగదు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కొంతకాలం తర్వాత మహిళ పెళ్లి గురించి ప్రశ్నించగా గోవర్ధన్ ఆ విషయాన్ని దాటవేస్తూ వచ్చాడు. ఆమె పదేపదే వివాహం గురించి నిలదీయడంతో బెదిరింపులకు దిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో బాధితురాలు నాగోల్ పోలీసులను ఆశ్రయించింది.
దర్యాప్తులో గోవర్ధన్కు ఇప్పటికే వివాహం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా, గత ఏడాది ఆల్వాల్కు చెందిన మరో మహిళను కూడా పెళ్లి పేరుతో మోసం చేసిన కేసులో అరెస్టై, ప్రస్తుతం బెయిల్పై బయట ఉన్నట్లు విచారణలో తేలింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన నాగోల్ పోలీసులు గోవర్ధన్ను అరెస్టు చేసి, ఘటనపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
ఈ ఘటనతో ఏఐ సాంకేతికతను ఉపయోగించి నకిలీ గుర్తింపులు సృష్టిస్తూ మోసాలకు పాల్పడుతున్న ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో, సోషల్ మీడియాలో పరిచయమయ్యే వ్యక్తుల వివరాలను పూర్తిగా నిర్ధారించుకున్న తర్వాతే నమ్మాలని పోలీసులు ప్రజలకు సూచిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
