
అవును తమకు పిల్లల పెళ్లికి వరకట్నాలు వద్దు ఆడంబారాలు అసలే వద్దుని చెప్పేస్తున్నారు ఆ గ్రామస్తులు. తమకు సాదాసీదా పెళ్లే ముద్దంటూ ఊరందరితో ప్రమాణం చేయించారు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీ కొలాం తెగలో చోటు చేసుకుంది. వరకట్నానికి దూరంగా ఉండాలని తమ తెగలోని ప్రతి ఒక్కరూ ఈ నియమ నిబందనలను పాటించాలంటూ తీర్మానాలు చేసుకున్నారు ఆ గ్రామంలోని ఆదిమ గిరిజన కొలాం సంఘం పెద్దలు.
ఆదిలాబాద్ జిల్లా సాత్నాల మండలం న్యూ టెంబ్రీగూడలో.. బేల, జైనథ్, సాత్నాల మండలాలకు చెందిన సంఘ పెద్దలు, పూజారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి ఈ నిర్ణయం తీసుకున్నారు. వరకట్నం ఇచ్చి పుచ్చుకోవడం అసలే చేయవద్దని.. పెళ్లికి ముందు జరిగే ఎర్రబొట్టు (ఎంగేజ్మెంట్) కార్యక్రమాన్ని అవసరానికి అనుగుణంగా సాదాసీదాగా జరుపుకోవాలని సూచించారు. ఆడంబరాలకు వెళ్లి అప్పులపాలు కావద్దని.. పెళ్లిపందిరి సంప్రదాయ పాతపద్ధతిలోనే ఉండాలి.. ప్రకృతి కి ప్రాదాన్యత ఇవ్వాలని తెలిపారు.
పెళ్లిచేసే పూజారులు, పెద్దలు, కుటుంబీకులు మద్యం, గంజాయి తాగొద్దని.. డీజేల జోలికి అసలు వెళ్ల వద్దని సూచించారు. కోలాం సంప్రదాయ వాయిద్యాలైన డోలు, పెంప్రీ వాయిద్యాలతోనే వేడుకలు నిర్వహించాలని సూచించారు కుల పెద్దలు. ఈ నియమ నిబందనలను పాటించకపోతే కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరికలు సైతం జారీ చేశారు. అందరితో ప్రతిజ్ఞ సైతం చేయించారు కోలాం కుల పెద్దలు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.