
మనలో చాలామంది పాత నాణేలు, నోట్లను చూస్తే పెద్దగా పట్టించుకోరు. కానీ ఖమ్మం జిల్లా కల్లూరుకు చెందిన మల్లెల్లి శ్రీను మాత్రం వాటిలో చరిత్రను చూశారు. ఆర్థికంగా చాలా సాధారణ కుటుంబానికి చెందిన పేదవాడైనప్పటికీ, తన అపురూపమైన అభిరుచితో నేడు ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
శ్రీనుకు కేవలం 15 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచే అరుదైన నాణేలు, వివిధ దేశాల కరెన్సీ నోట్లను సేకరించడం అలవాటుగా మారింది. జీవితాన్ని ఒక లారీ క్లీనర్గా ప్రారంభించిన ఆయన, వృత్తిరీత్యా వివిధ రాష్ట్రాలు తిరుగుతూ ఎక్కడ అరుదైన నాణేలు కనిపించినా వదిలిపెట్టేవారు కాదు. కొన్నిసార్లు పాత నాణేలు ఉన్నాయని తెలిస్తే, తన వద్ద ఉన్న కొద్దిపాటి డబ్బును చెల్లించి మరీ వాటిని కొనుగోలు చేసి భద్రపరిచేవారు. ఇలా ఇప్పటివరకు ఆయన దాదాపు 300కు పైగా అరుదైన నాణేలు, నోట్లను సేకరించారు.
శ్రీను సేకరణలో అరుదైన నిధులు చేరాయి. నిజాం రాజుల కాలం నాటి రాగి నాణేలు, బ్రిటిష్ పాలన నాటి నాణేలు, స్వాతంత్ర్యానంతరం భారత ప్రభుత్వం ముద్రించిన నాణేలు ఇలా చారిత్రక నాణేలు ఆయన వద్ద ఉన్నాయి. బ్రిటిష్ కాలానికి చెందిన రాజులు, రాణులు అయిన విలియమ్, విక్టోరియా, ఎలిజబెత్ చిత్రాలతో కూడిన నాణేలు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. అంతేకాదు అమెరికా, రష్యా, జమైకా, సింగపూర్, బ్రెజిల్, శ్రీలంక, ఖతర్, మలేషియా, హాంకాంగ్, థాయిలాండ్ వంటి ఎన్నో దేశాల కరెన్సీ నోట్లు, నాణేలు ఆయన వద్ద భద్రంగా ఉన్నాయి. పేదరికం ఉన్నా అభిరుచికి హద్దులు లేవని నిరూపించిన మల్లెల్లి శ్రీను నిజంగా అభినందనీయుడు. చరిత్రను కాపాడుతూ, భవిష్యత్ తరాలకు దానిని పరిచయం చేయడానికి ఆయన పడుతున్న తపన ప్రశంసించదగినది.
వీడియో ఇక్కడ చూడండి..
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..