
ప్లేస్.. నిజామాబాద్ నవీపేట. ఆ ఇంట్లో అప్పటివరకు అంతా హడావుడి..పెళ్లి సందడి..పచ్చటి తోరణాలు..పూలదండలు.. బంధుమిత్రులతో కళకళలాడిపోయింది ఆ ఇల్లు. మరికొద్దిగంటల్లో పెళ్లి..అంతా సిద్ధమైంది. కానీ అంతలోనే తీరని విషాదం. పెళ్లికూతురిగా ముస్తాబై పెళ్లిపీటలెక్కాల్సిన వధువు ఆత్మహత్య చేసుకుంది. ఉరికొయ్యకు వేలాడుతూ విగతజీవిగా కనిపించింది. అందరినీ శోకసంద్రంలో ముంచి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. కాబోయే భర్త వేధింపులే రవళి ఆత్మహత్యకు కారణమని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఆమె కుటుంబసభ్యులు. తమ బిడ్డను పెళ్లికొడుకు వేధించాడని..అందుకే ఆత్మహత్య చేసుకుందని ఆరోపిస్తున్నారు రవళి తండ్రి. రాత్రి లాస్ట్ ఫోన్ కాల్ అతనితోనే మాట్లాడిందని..అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఐతే రవళితో రాత్రి పెళ్లి గురించే మాట్లాడానని.. జాబ్ చేయాలని ఫోర్స్ చేయలేదంటున్నాడు పెళ్లికొడుకు సంతోష్. ఆస్తిలో వాటా కోరిన మాట అవాస్తవమంటున్నారు.
నవీపేటలో రవళి మృతదేహానికి పోస్ట్మార్టం నిర్వహించారు. రవళి తల్లిదండ్రుల ఫిర్యాదుతో సంతోష్పై కేసు నమోదు చేశారు పోలీసులు. రవళి, సంతోష్ కాల్డేటా వివరాలను సేకరిస్తున్నారు. పెళ్లికొడుకు వేధింపులకు గురి చేశాడా.? మానసికంగా టార్చర్ పెట్టాడా..? లేక మరెవరైనా ఆమెను బెదిరించారా.. లేదా ఇంకేదైనా కారణం అన్నది విచారణలో తేలనుంది. హల్ది ఫంక్షన్లో అంత చక్కగా నవ్వుతూ డ్యాన్స్ చేసిన పిల్ల.. గంటల వ్యవధిలో సూసైడ్ చేసుకోవడంపై చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏదో బలమైన రీజన్ ఉండే ఉంటుందని స్థానికులు అనుమానిస్తున్నారు.
సమస్య ఏదైనా.. తల్లిదండ్రులతో ధైర్యంగా చెప్పి ఉంటే సరిపోయేది. చనిపోవడానికి సిద్ధపడిందే కానీ తన బాధకు కారణం ఏంటో ఇంట్లో వాళ్లకు చెప్పలేకపోయింది. ఫలితం కాళ్ల పారాణి ఆరకముందే రవళి జీవితం ముగిసిపోయింది. పెళ్లి జరగాల్సిన టైమ్కే పచ్చటి తోరణాలు, పూలదండలు తీసివేయడం అందరినీ కలిచివేసింది. మ్యారేజ్కు కొన్ని గంటలకు ముందు..అమ్మాయి సూసైడ్ చేసుకోవడంతో విషాదం నెలకొంది.