
మనిషంటే విలువలేదు.. మనిషి ప్రాణమంటే లెక్కలేదు. మనీకి ఇచ్చిన విలువ మనిషికి ఇవ్వడం లేదు. అనైతిక బంధాల కోసం కత్తులకు పని చెబుతున్నారు. కుత్తుకలు తెగ్గేసే కుట్రలకు తెగిస్తున్నారు. ఇటీవల కాలంలో అక్రమ సంబంధాల కారణంగా పలు దారుణాలు వెలుగులోకి వస్తున్నాయి. క్షణికావేశంతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకుని ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇలాంటి ఘటనే మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది.
మెదక్ జిల్లా పాపన్నపేట మండలం కొడుపాక గ్రామానికి చెందిన 35 ఏళ్ల సులోచన భర్త చనిపోవడంతో ఒంటరిగా ఉంటోంది. మెదక్లో భవన నిర్మాణ పనులకు వెళ్లేది. అక్కడే మేస్త్రిగా పనిచేస్తున్న రాజుతో ఆమెకు పరిచయం ఏర్పడింది. అది వివాహేతర సంబంధానికి దారి తీసింది. అయితే, అదే మేస్త్రి రాజుకు, బూలీ అనే మరో మహిళతో కూడా సంబంధం ఉండటంతో అసలు గొడవ అక్కడ మొదలైంది. బూలీతో రాజు సన్నిహితంగా ఉండటాన్ని సులోచన భరించలేకపోయింది. ఈ క్రమంలో రాజుతో ఆమె తరచూ గొడవ పడేది. తమ సంబంధానికి అడ్డుగా మారుతున్న సులోచనను వదిలించుకోవాలని రాజు, బూలీ పథకం వేశారు.
మార్చి 9వ తేదీన రాజు, బూలీ కలిసి.. మద్యం తాగుదామని నమ్మించి సులోచనను బైక్పై ఎక్కించుకున్నారు. ఏడుపాయల ఆలయ సమీపంలోని నిర్జన ప్రదేశమైన చెలిమేకుంటకు తీసుకెళ్లారు. అక్కడ ముగ్గురూ కలిసి మద్యం సేవించిన తర్వాత, సులోచన మత్తులోకి జారుకోగానే రాజు, బూలీ కలిసి కర్రతో ఆమెపై విచక్షణారహితంగా దాడి చేశారు. సులోచన ప్రాణం పోయాక, ఆమె ఒంటిపై ఉన్న బంగారు, వెండి ఆభరణాలను దోచుకుని అక్కడి నుంచి పరారయ్యారు. దొంగల దాడిలో చనిపోయినట్లు నమ్మించే ప్రయత్నం చేశారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఘటనాస్థలంలో లభించిన ఆధారాలు, సీసీ కెమెరాల ఫుటేజీని విశ్లేషించిన పోలీసులు నిందితులను పట్టుకున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..