Telangana: పైకి చూస్తే ఏపుగా పెరిగిన పత్తి చేను.. లోపలికి వెళ్లి చూడగా పోలీసులే కళ్లు తేలేశారు
అడవుల జిల్లా ఆదిలాబాద్ లో గంజాయి పై పోలీసులు హుక్కు పాదం మోపుతున్నారు. సమాచారం రావడమే ఆలస్యం రంగంలోకి దిగి నిఘా పెట్టి మరీ పట్టుకుంటున్నారు. గుట్టుగా సాగుతున్న గంజాయి సాగు ను కూకటి వేళ్లతో పెకిలించే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఆదిలాబాద్ జిల్లాలో ఏకంగా 62 లక్షల విలువ చేసే గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.

ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ పరిధిలోని తోషం శివారులో పత్తి చేనులో అంతర్ పంటగా సాగు చేస్తున్న గంజాయిని పట్టుకున్నారు. తోషం శివారులో తమ పంటచేళ్లలో సాగు చేస్తున్న ముగ్గురు రైతులకు చెందిన పత్తి పంటలో 627 గంజాయి మొక్కలను గుర్తించి కేసు నమోదు చేశారు. ఇచ్చోడ సర్కిల్ పోలీసులు సంయుక్తంగా దాడి చేసి గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని అత్యాశతో గంజాయి పండించడం జరిగిందని, వీరిపై గాంజా యాక్ట్.. ఎన్డిపిఎస్ ప్రకారం గుడిహత్నూర్ పోలీస్ స్టేషన్లో రెండు కేసులు నమోదు అయినట్లు ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు.
ఆదిలాబాద్ జిల్లాలో గంజాయి నిర్మూలనకు ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించిన పెడచెవిన పెడుతూ ఇలాంటి గంజాయి మొక్కల పెంపకం చేస్తున్న వారి పట్ల జిల్లా పోలీస్ యంత్రాంగం కఠినంగా వ్యవహరిస్తుందని ఎస్పీ అన్నారు. వీరికి ప్రభుత్వం పథకాలు రాకుండా సిఫార్సు చేయడం జరుగుతుందని.. గంజాయికి బానిసై యువత భవిష్యత్తును, జీవితాలను నాశనం చేసుకుంటుందని.. గంజాయి సేవిస్తూ పట్టుబడినా.. సాగు చేస్తూ పట్టుబడినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పట్టుకున్న గంజాయి మొక్కల విలువ దాదాపు బహిరంగ మార్కెట్లో 62 లక్షల 70 వేల రూపాయల వరకు ఉంటుందని తెలిపారు. ఒక్కొక్క మొక్క పదివేల చొప్పున బహిరంగ మార్కెట్లో విక్రయించడం జరుగుతుందని గంజాయి పండించడం పట్ల, మాదకద్రవ్యాల పట్ల జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తతతో ఉంటూ గంజాయిని జిల్లా నుంచి తరిమి వేయడం లక్ష్యంగా విధులను నిర్వర్తిస్తుందని తెలిపారు. ప్రజలందరికీ జిల్లా ఎస్పీ సూచనలు ఇస్తూ గంజాయి పై ఎలాంటి సమాచారం ఉన్న 8712659973 నంబర్ కి వాట్సాప్ ద్వారా సమాచారం అందించవచ్చని సమాచారం జిల్లా ఎస్పీకి నేరుగా అందించబడుతుందని తెలిపారు. ఈ ఏడాదిలో జిల్లాలో 120 గంజాయి కేసులు నమోదు కాగా అందులో 40 కిలోల వరకు ఎండు గంజాయి, 600 గంజాయి మొక్కలు స్వాధీనం చేసుకున్నట్లు, ఈ కేసులలో 240 మంది వరకు నిందితులపై కేసులు నమోదు చేసి అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉట్నూర్ ఎఎస్పి కాజల్ సింగ్ ఐపీఎస్, సిసిఎస్ ఇన్స్పెక్టర్ పి చంద్రశేఖర్, ఇచ్చోడా సీఐ బండారి రాజు, ఎస్ఐ శ్రీకాంత్ సిబ్బంది, సిసిఎస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.