
ఖమ్మం జిల్లాలో ఓ భారీ కొండచిలువ సంచారం తీవ్ర కలకలం రేపింది. ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ఇందిరమ్మ కాలనీ రోడ్ నెంబర్ 5లో కొందరు మహిళలు నలుడుచుకుంటూ వెళ్తుండగా భారీ కొండచిలువ వారి కంటపడింది. కాలనీ మధ్యలోకి సుమారు 15 అడుగుల కొండచిలువను చూసిన స్థానికలు ఒక్కసారిగా భయంతో వణికిపోయారు. వెంటనే అక్కడి నుంచి పరుగులు పెట్టారు. ఆ తర్వాత స్నేక్ క్యాచర్కు సమాచారం ఇచ్చారు. దీంతో వెంటనే స్నేక్ క్యాచర్ సూర్య, తన సహాయకుడు మద్దుతో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు.
ఖాళీ స్థలంలోని చెత్తలో దూరిన కొండచిలువను పట్టుకునేందుకు దాదాపు 30 నిమిషాల పాటు శ్రమించారు. చివరకు ఎలాగోలా దాన్ని పట్టుకొని బంధించారు. పట్టుబడిన ఈ భారీ కొండచిలువను అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి వదిలేశారు. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. కొండచిలువను చాకచక్యంగా పట్టుకున్న సూర్య బృందానికి కాలనీవాసులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
అయితే మున్సిపాలిటీ పరిధిలోని ఖాళీ స్థలాల్లో దట్టంగా పెరిగిన పిచ్చి మొక్కలు, చెట్ల కారణంగానే ఇలాంటి పాములు నివాసాలు ఏర్పరుచుకుంటున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఖాళీ ప్లాట్లను శుభ్రం చేసేలా మున్సిపాలిటీ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నారు.
వీడియో చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.