
చాలా మంది తమ స్మార్ట్ఫోన్ బ్యాటరీ పాడవుతుందనే భయంతో రాత్రంతా ఛార్జింగ్లో ఉంచరు. ఎక్కువ సేపు ఛార్జింగ్ పెట్టడం వల్ల ఫోన్ మదర్బోర్డు దెబ్బతినే ప్రమాదం ఉంది. ఈ చిక్కులను పరిష్కరించడానికి చైనాకు చెందిన కువాజియా అనే సంస్థ ఒక కొత్త వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఆటో ఎజెక్ట్ మొబైల్ ఛార్జర్, బ్యాటరీ 100 శాతం నిండగానే ఫోన్ సాకెట్ నుండి ఛార్జర్ పిన్ను ఆటోమేటిక్గా బయటకు నెట్టేస్తుంది. దీని కోసం ఛార్జర్లో ఒక స్ప్రింగ్, ఒక విద్యుదయస్కాంతం అమర్చింది.
ఇది ఎలా పనిచేస్తుంది?
ఈ ఛార్జర్లో ప్రత్యేకమైన సెన్సార్ ఉంటుంది. మీ ఫోన్ బ్యాటరీ పూర్తి కాగానే ఈ సెన్సార్ గుర్తిస్తుంది. వెంటనే ఎలక్ట్రో మాగ్నెటిక్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. అప్పుడు అందులోని స్ప్రింగ్ సాయంతో ఛార్జర్ పిన్ను ఫోన్ నుండి బయటకు నెట్టేస్తుంది. దీనివల్ల ఛార్జింగ్ నిలిచిపోతుంది, ఫోన్ ఓవర్ హీట్ అవ్వదు. అలాగే ఫోన్ పేలిపోయే ప్రమాదాలు కూడా చాలా వరకు తగ్గుతాయి.
దీని ధర ఎంత?
శామ్సంగ్, యాపిల్, షియోమీ, వన్ప్లస్ వంటి ప్రముఖ కంపెనీలు ఇప్పటికే తమ స్మార్ట్ఫోన్లలో బ్యాటరీ మేనేజ్మెంట్ ఫీచర్లను అందించాయి. బ్యాటరీ ఫుల్ అవ్వగానే విద్యుత్ ప్రవాహాన్ని తగ్గించడం లేదా ఆపేయడం వంటి ఫీచర్లు ఉన్నప్పటికీ, సాధారణ స్మార్ట్ఫోన్ వినియోగదారులకు వీటిపై పూర్తి అవగాహన ఉండదు. అలాంటి వారికి ఈ ఆటో ఎజెక్ట్ ఛార్జర్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ప్రస్తుత సమాచారం ప్రకారం, విదేశీ మార్కెట్లలో ఈ ఛార్జర్ల ధర సుమారు రూ. 750 వరకు ఉంది. అయితే, భారత మార్కెట్లోకి వచ్చేసరికి వీటి ధర పెరిగే అవకాశం ఉంది.
మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.