భూమికి మరికొన్నేళ్లలో భారీ ముప్పు.. చందమామకు కూడా డేంజరే..!
త్వరలోనే భూమికి పెను ప్రమాదం ముంచుకొస్తుందని నాసా శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఓ భారీ ఉల్క భూమిని ఢీ కొనే అవకాశం ఉందని వెల్లడించారు. అయితే ఇప్పుడు తాజాగా అదే ఉల్క చంద్రుడిని కూడా ఢీకొనే అవకాశం ఉందని అంటున్నారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

భూమిని ఢీకొట్టేందుకు ఓ గ్రహశకలం విశ్వంలో దూసుకొస్తోందని నాసా శాస్త్రవేత్తలు ప్రకటించిన విషయం తెలిసిందే. 2032లో ఈ ముప్పు సంభవిస్తుందని కూడా సైంటిస్టులు వెల్లడించారు. అయితే తాజా రిపోర్ట్స్ ప్రకారం, ఆ గ్రహశకలం భూమికి సహజ ఉపగ్రహమైన చంద్రుడిని కూడా ఢీ కొనే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ గ్రహశకలాన్ని డిసెంబర్ చివరలో నాసా నిధులతో పనిచేసే చిలీలోని ఆస్టరాయిడ్ టెరెస్ట్రియల్-ఇంపాక్ట్ లాస్ట్ అలర్ట్ సిస్టమ్ స్టేషన్లోని శాస్త్రవేత్తలు మొదటిసారి గుర్తించారు. 130 నుంచి 300 అడుగుల వెడల్పుతో ఆ ఉల్క(గ్రహశకలం) ఉన్నట్లు గుర్తించారు. అయితే ఆ ఉల్క భూమి భూమిని ఢీకొనే అవకాశం 1.3 శాతంగా ఉందని అప్పట్లో శాస్త్రవేత్తలు అంచనా వేశారు. కానీ, ఒక వారం వ్యవధిలో ఢీకొనే అవకాశం దాదాపు రెట్టింపు అయి 2.3 శాతానికి పెరిగింది. అదే ఉల్క చంద్రుడిని కూడా ఢీ కొనే అవకాశం 0.3 శాతంగా ఉందట.
ఈ విషయాన్ని అరిజోనా యూనివర్సిటీలోని కాటాలినా స్కై సర్వేకు ఆపరేషన్స్ ఇంజనీర్ డేవిడ్ రాంకిన్ తన సోషల్ మీడియా పోస్ట్లో తెలిపారు. ఒక వేళ ఆ ఉల్క చంద్రుడిని ఢీ కొంటే.. హిరోషిమాపై పడిన అణుబాంబు విధ్వంసం గుర్తిందిగా, అలాంటి 340 అణుబాంబులు ఒకేసారి చంద్రుడిపై పడితే ఎలా ఉంటుందో అంతటి విధ్వంస ఉంటుందని కూడా సైంటిస్టులు చెబుతున్నారు. అదే జరిగే ఆ దశ్యాలు భూమిపై నుంచి చూడొచ్చని కూడా చెబుతున్నారు. అంటే చంద్రుడిపై జరిగే ఆ విధ్వంసం భూమిపై ఉన్న మనకు కనిపించేంత పెద్దగా జరుగుతుందని అర్థం. ఉల్క ప్రభావం కారణంగా చంద్ర ఉపరితలంపై రెండు కిలోమీటర్ల వెడల్పు ఉన్న ఒక బిలం కూడా ఏర్పడుతుందట.
నాసా ప్రకారం, 2024 YR4 దీర్ఘవృత్తాకార, నాలుగు సంవత్సరాల కక్ష్యను అనుసరిస్తుంది, అంగారక గ్రహాన్ని దాటి బృహస్పతి వైపు వెళ్లే ముందు లోపలి గ్రహాల గుండా తిరుగుతుంది. ఒక వేళ భూమిని కొంటే అది ఏ ప్రాంతంలో ఢీ కొంటుందో కూడా శాస్త్రవేత్తలు అంచనా వేశారు. తూర్పు పసిఫిక్ మహాసముద్రం, ఉత్తర దక్షిణ అమెరికా, అట్లాంటిక్ మహాసముద్రం, ఆఫ్రికా, అరేబియా సముద్రం, దక్షిణాసియా ప్రాంతాల్లో ఆ ఉల్క భూమిని ఢీకొనొచ్చు. అయితే ఈ ముప్పు కారణంగా భూమిపై జీవరాశి పూర్తిగా అంతం కాదు కానీ, చాలా ప్రాంతం మాత్రం విధ్వంసానికి గురి అవుతుంది. 2032 అంటే ఇంకా చాలా సమయం ఉంది కనుక.. ఆ ఉల్కను దారి మళ్లించే ప్రయత్నాలు నాసా చేస్తోంది. అలాగే చైనా వంటి దేశాలు ఇలాంటి ప్రమాదాలను ఎదుర్కోవడానికి ఇప్పటికే ఒక గ్రహ రక్షణ దళాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించాయి.
మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




