
తెలంగాణలోని రెండో తరగతి నుంచి ఐదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల అభ్యసన స్థాయిని తెలుసుకునేందుకు పాఠశాల విద్యాశాఖ రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక బేస్లైన్ పరీక్షలు నిర్వహిస్తోంది. ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ (FLN) కార్యక్రమంలో భాగంగా దాదాపు 11.90 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరవుతున్నారు. బుధవారం ప్రారంభమైన ఈ పరీక్షలు ఈ నెల 29 వరకు 33 జిల్లాల్లో కొనసాగనున్నాయి.
విద్యార్థుల చదవడం, రాయడం, లెక్కలు చేయడం వంటి ప్రాథమిక నైపుణ్యాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకోవడమే ఈ పరీక్షల ప్రధాన ఉద్దేశం. విద్యా సంవత్సరంలో మొత్తం మూడు పరీక్షలు నిర్వహిస్తారు. ప్రారంభంలో బేస్లైన్ టెస్ట్, నవంబరులో మిడ్లైన్ టెస్ట్, విద్యా సంవత్సరం చివర్లో మార్చిలో ఎండ్లైన్ టెస్ట్ నిర్వహించి విద్యార్థుల పురోగతిని అంచనా వేస్తారు. ఈసారి ప్రత్యేకంగా తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ యాప్లో కొత్త మాడ్యూల్ను రూపొందించి, మొబైల్ ఫోన్ ద్వారానే పరీక్షలు నిర్వహిస్తున్నారు.
ఇలాంటి విధానాన్ని దేశంలో తొలిసారిగా అమలు చేస్తున్నామని NCERT అధికారులు తెలిపారు. గతంలో ప్రశ్నపత్రాలు, జవాబులను కాగితాలపై నమోదు చేయడంతో ఫలితాల నమోదు ఆలస్యమయ్యేది. ఇప్పుడు యాప్లోనే వెంటనే వివరాలు నమోదు చేసే అవకాశం కల్పించారు. దీని వల్ల ప్రక్రియ వేగంవంతమైందని తెలిపారు.
మొబైల్లో పరీక్షల నిర్వహణ
పరీక్షల సమయంలో ఉపాధ్యాయులు ఒక్కో విద్యార్థిని పిలిచి మొబైల్ ఫోన్లో తెలుగు, ఇంగ్లీష్, గణితం ప్రశ్నలను చూపిస్తారు. విద్యార్థి ఇచ్చిన సమాధానాలను వెంటనే యాప్లో నమోదు చేస్తారు. ఇంగ్లీష్ పదాలను చదవడం, చిత్రాన్ని చూసి పదాలు రాయడం, ఒక నిమిషంలో 25 ఆంగ్ల పదాలను చదవడం, వాక్యాలు చదవడం వంటి అంశాలు పరీక్షలో ఉంటాయి. ప్రశ్నలు విద్యార్థి చదివే తరగతికి అనుగుణంగా ఉంటాయి.
ప్రతి జిల్లాలో రెండు రోజుల పాటు ఈ పరీక్షలు నిర్వహిస్తారు. ఆ రోజుల్లో హాజరు కాలేని విద్యార్థులకు మరో రోజు అవకాశం కల్పిస్తారు. ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేట్ పాఠశాలల్లో కూడా ఈ పరీక్షలు వచ్చే నెలలో నిర్వహించాలని విద్యాశాఖ భావిస్తోంది
మరిన్ని కెరీర్ అండ్ ఉద్యోగ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.