
Sakshi Chaudhary, Commonwealth Games 2026 boxing: కామన్వెల్త్ గేమ్స్-2026లో భారత బాక్సర్లు అదరగొడుతున్నారు. రింగ్లోకి దిగితే పతకం పక్కా అన్న రేంజ్లో రెచ్చిపోతున్నారు. తాజాగా స్కాట్లాండ్ లోని గ్లాస్గో వేదికగా జరుగుతున్న ఈ క్రీడల్లో భారత యువ బాక్సర్ సాక్షి చౌదరి సత్తా చాటింది. ప్రత్యర్థికి చుక్కలు చూపిస్తూ ఏకంగా సెమీఫైనల్స్ లోకి అడుగుపెట్టి, భారత్కు మరో పతకాన్ని ఖాయం చేసింది.
మహిళల 51 కేజీల విభాగంలో జరిగిన క్వార్టర్ ఫైనల్ పోరులో సాక్షి తన విశ్వరూపం చూపించింది. నార్తర్న్ ఐర్లాండ్కు చెందిన కైట్లిన్ ఫ్రైయర్స్ పై ఆమె ఆధిపత్యం చెలాయించింది. బౌట్ ప్రారంభం నుంచే తనదైన శైలిలో పంచులతో విరుచుకుపడుతూ కైట్లిన్ను ఉక్కిరిబిక్కిరి చేసింది. తన ఎత్తును, రీచ్ అడ్వాంటేజ్ ను పూర్తి స్థాయిలో వాడుకుంటూ, సరైన టైమింగ్ తో పంచులు విసురుతూ ప్రత్యర్థిని ముప్పుతిప్పలు పెట్టింది.
సాక్షి వ్యూహం చాలా స్పష్టంగా కనిపించింది. కైట్లిన్ దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించినా, సాక్షి తన లాంగ్ రేంజ్ పంచులతో ఆమెను కట్టడి చేసింది. మూడు రౌండ్లలోనూ అదే జోరు కొనసాగించి, ఐదుగురు జడ్జీల మన్ననలు పొందింది. ఏకపక్షంగా సాగిన ఈ పోరులో 5-0 తేడాతో ఘన విజయం సాధించి సెమీస్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంది. ఈ విజయంతో భారత్కు కామన్వెల్త్ గేమ్స్లో ఐదో బాక్సింగ్ పతకం ఖాయమైంది.
సెమీస్కు చేరుకుని కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకున్న సాక్షి.. తన లక్ష్యం అది కాదని తేల్చి చెప్పింది. “పతకం రంగును కచ్చితంగా గోల్డ్గా మారుస్తా” అని ధీమా వ్యక్తం చేసింది. శుక్రవారం జరిగే సెమీఫైనల్ పోరులో కెనడాకు చెందిన అంబర్-జేన్ వాల్ తో సాక్షి తలపడనుంది. ఈ మ్యాచ్లోనూ గెలిచి ఫైనల్ లో అడుగుపెట్టాలనే పట్టుదలతో ఉంది.
కామన్వెల్త్ గేమ్స్లో భారత బాక్సర్లు ఇప్పటికే సత్తా చాటుతున్నారు. సాక్షి చౌదరి కంటే ముందే లవ్లీనా బోర్గోహైన్ (75 కేజీలు), ప్రీతి పవార్ (54 కేజీలు), ప్రియా ఘంఘాస్ (60 కేజీలు), జాదుమణి సింగ్ (పురుషుల 55 కేజీలు) సెమీస్కు చేరుకుని పతకాలను ఖాయం చేసుకున్నారు. అరుంధతి చౌదరి, సచిన్ సివాచ్, అంకుష్ యాదవ్, నరేందర్ బెర్వాల్ తదితరులు తమ తమ విభాగాల్లో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లకు సిద్ధమవుతున్నారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..