
PV Sindhu : మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతల కారణంగా దుబాయ్లో చిక్కుకుపోయిన భారత బ్యాడ్మింటన్ దిగ్గజం, రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు ఎట్టకేలకు సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నారు. మంగళవారం ఉదయం ఆమె బెంగళూరు ఎయిర్ పోర్టులో దిగారు. తన ప్రాణాలకు ముప్పు పొంచి ఉన్న స్థితి నుంచి క్షేమంగా ఇంటికి చేరుకోవడంతో సింధు ఊపిరి పీల్చుకున్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ, తనను కాపాడిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
గత వారం ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో పాల్గొనేందుకు సింధు తన టీమ్తో కలిసి ఇంగ్లాండ్ బయలుదేరారు. అయితే, దుబాయ్లో విమానం మారాల్సి ఉన్న సమయంలో ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం మొదలైంది. అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ప్రతిగా ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడటంతో దుబాయ్ ఎయిర్ పోర్టు నుంచి విమాన సర్వీసులు నిలిచిపోయాయి. దీనివల్ల శనివారం నుంచి సింధు దుబాయ్లోనే చిక్కుకుపోయారు.
మరీ భయంకరమైన విషయం ఏమిటంటే, సింధు బస చేసిన ప్రాంతానికి సమీపంలోనే ఒక భారీ పేలుడు సంభవించింది. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. వెంటనే భారత రాయబార కార్యాలయం, యూఏఈ అధికారులు రంగంలోకి దిగి సింధును, ఆమె బృందాన్ని అత్యంత సురక్షిత ప్రాంతానికి తరలించారు. యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో అక్కడున్న భారతీయులను తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించి, సింధు బెంగళూరు చేరుకోగలిగారు.
తన క్షేమ సమాచారాన్ని ఎక్స్లో పంచుకుంటూ.. “గడిచిన కొన్ని రోజులు చాలా భయంకరంగా, అనిశ్చితంగా గడిచాయి. ఎట్టకేలకు సురక్షితంగా బెంగళూరులోని నా ఇంటికి చేరుకున్నాను. ఈ క్లిష్ట సమయంలో మాకు అండగా నిలిచిన దుబాయ్ అధికారులు, ఎయిర్పోర్ట్ సిబ్బంది, ఇమిగ్రేషన్ టీమ్స్, గ్రౌండ్ సిబ్బందికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. వారి వృత్తి నైపుణ్యం, మానవత్వం వెలకట్టలేనివి. ప్రస్తుతం నాకు విశ్రాంతి అవసరం. రీసెట్ అయ్యాక తదుపరి అడుగుల గురించి ఆలోచిస్తాను” అని సింధు రాసుకొచ్చారు.
Back home in Bangalore and safe 🙏
The last few days have been intense and uncertain, but I’m truly grateful to be back to my house. A heartfelt thank you to the incredible ground teams, Dubai authorities, airport staff, immigration, and every single person who stepped up and…
— Pvsindhu (@Pvsindhu1) March 3, 2026
కాగా, మంగళవారమే ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్షిప్ ప్రారంభం కావాల్సి ఉంది. ఈ అనివార్య కారణాల వల్ల సింధు ఈ టోర్నీలో పాల్గొనడంపై సందిగ్ధత నెలకొంది. ఆమె ఇప్పటికే బెంగళూరు చేరుకోవడంతో ఈ మెగా టోర్నీకి దూరం కానున్నట్లు తెలుస్తోంది. అయితే, ప్రయాణ ఆటంకాల వల్ల ఆలస్యంగా వచ్చే క్రీడాకారుల కోసం షెడ్యూల్లో మార్పులు చేసే దిశగా ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. సింధు ప్రాణాలతో క్షేమంగా తిరిగి రావడమే తమకు కావాలని ఆమె అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్లు పెడుతున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..