
World Cup 2023: ప్రపంచకప్ షెడ్యూల్లో ఎలాంటి మార్పు ఉండదని భారత క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది. బ్యాక్ టు బ్యాక్ మ్యాచ్ ల కారణంగా భద్రత అంశాన్ని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లేవనెత్తింది. అయితే బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా మాత్రం దీన్ని పూర్తిగా ఖండిస్తూ.. మ్యాచ్ల షెడ్యూల్ను ఇప్పట్లో మార్చడం కుదరదని చెప్పేశారు.
ప్రపంచ కప్ 2023 కొత్త షెడ్యూల్ ప్రకారం, హైదరాబాద్ వరుసగా రెండు రోజులు మ్యాచ్లను నిర్వహించాల్సి ఉంది. అక్టోబర్ 9న న్యూజిలాండ్, నెదర్లాండ్స్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. అదే సమయంలో అక్టోబర్ 10న హైదరాబాద్లో పాకిస్థాన్-శ్రీలంక మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. వరుసగా రెండు రోజుల పాటు మ్యాచ్లు నిర్వహించలేమని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తెలిపింది. ఈ మేరకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ బీసీసీఐకి లేఖ రాసి రెండు మ్యాచ్లకు కొంత గ్యాప్ ఇవ్వాలని డిమాండ్ చేసింది. నివేదికల ప్రకారం, బ్యాక్ టు బ్యాక్ మ్యాచ్లకు భద్రత కల్పించడంలో హైదరాబాద్ పోలీసులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
అయితే దీనిని బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా తీవ్రంగా ఖండించారు. ‘ప్రపంచకప్ హైదరాబాద్ వేదికగా నేనే బాధ్యతలు నిర్వహిస్తున్నాను. ఏదైనా సమస్య ఉంటే, దానికి పరిష్కారం కనుగొనే ప్రయత్నం చేస్తాం. ప్రపంచకప్ షెడ్యూల్ను మార్చడం అంత సులువు కాదు. అది జరిగేలా కనిపించడం లేదు. షెడ్యూల్ను మార్చే అవకాశం బీసీసీఐ మాత్రమే కాదు. ఆయా జట్లతోపాటు ఐసీసీ కూడా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది’ అంటూ చెప్పుకొచ్చారు.
ప్రపంచ కప్ 2023లో భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అక్టోబర్ 15 న జరగాల్సి ఉంది. కానీ, అక్టోబర్ 15న అహ్మదాబాద్ పోలీసులు భద్రత కల్పించేందుకు నిరాకరించారు. అదే రోజు నుంచి నవరాత్రులు ప్రారంభమవుతున్నాయని, దీంతో రెండు చోట్లా భద్రత కల్పించలేమని ప్రకటించారు. ఆ తర్వాత భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఒక రోజు ముందుగా అంటే అక్టోబర్ 14కు మర్చారు. దీంతో మిగతా మ్యాచ్ల షెడ్యూల్పై కూడా తీవ్ర ప్రభావం పడింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కూడా తమ ప్రయత్నాలు కొనసాగించింది. దీంతో బీసీసీఐ నుంచి ఆశించిన సమాధానం రాకపోవడంతో నానా హైరానా పడుతోంది హెచ్సీఏ.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..