
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 వేలం ఇటీవల ముగిసిన సంగతి తెలిసిందే. ఈ వేలంలో రాజస్థాన్ రాయల్స్ ఆచితూచి వ్యవహరించింది. వేలంకు ముందే కెప్టెన్ సంజు శాంసన్ను చెన్నై సూపర్ కింగ్స్కు ట్రేడ్ చేసిన రాజస్థాన్.. మినీ వేలం ముగిసేసరికి రవీంద్ర జడేజా, శామ్ కర్రన్, రవి బిష్టోయ్ లాంటి ఆటగాళ్లను తమ జట్టులోకి చేర్చుకుంది. అయితే, కెప్టెన్సీ విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ లేదు. ఇప్పుడదే సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారింది. దీనిపై ఇటీవల రాబిన్ ఊతప్ప, అనిల్ కుంబ్లే డిబేట్ కొనసాగించారు.
రాజస్థాన్ జట్టులో 10 మంది ఫాస్ట్ బౌలర్లు ఉన్నారని.. బౌలింగ్ సెలక్షన్ ఎలాంటి ఇబ్బంది లేదని ఊతప్ప పేర్కొన్నాడు. బిష్టోయ్, జడేజా లాంటి టాప్ స్పిన్నర్లు, షిమ్రాన్ హెట్మెయర్, డెనోవన్ ఫెర్రీరా, ధృవ్ జురెల్, రియాన్ పరాగ్లతో బ్యాటింగ్ కూడా బలంగా ఉందని తెలిపాడు. జట్టు సమతుల్యంగా కనిపిస్తున్నప్పటికీ, కెప్టెన్సీ విషయంలోనే ఇంకా సందిగ్ధత ఉందన్నాడు. కెప్టెన్సీ రియాన్ పరాగ్ లేదా రవీంద్ర జడేజాకు దక్కే అవకాశాలు ఉన్నాయని.. యశస్వి జైస్వాల్ మరికొంత కాలం వేచి ఉండాల్సిందేనని తెలిపాడు. స్పిన్ లెజెండ్ అనిల్ కుంబ్లే కూడా జట్టు సమతుల్యతను ఒప్పుకున్నాడు. అయితే జోఫ్రా ఆర్చర్ లాంటి కీలక ఫాస్ట్ బౌలర్ల ఫిట్నెస్ గురించి ఆందోళన వ్యక్తం చేశాడు. తుది కెప్టెన్ను జట్టు యాజమాన్యం త్వరలోనే ప్రకటించనుందని కుంబ్లే తెలిపాడు.