Shashi Tharoor: ఆ బౌలర్‌ స్పీడుకు శశిథరూర్‌ ఫిదా.. త్వరగా టీమిండియాలోకి తీసుకోవాలంటూ ట్వీట్‌..

IPL 2022: టోర్నీ ఆరంభంలో వరుసగా పరాజయాలు ఎదుర్కొన్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (SRH) ఇప్పుడు చెలరేగిపోతోంది. గోడకు కొట్టిన బంతిలా వరుసగా విజయాలు సాధిస్తోంది.

Shashi Tharoor: ఆ బౌలర్‌ స్పీడుకు శశిథరూర్‌ ఫిదా.. త్వరగా టీమిండియాలోకి తీసుకోవాలంటూ ట్వీట్‌..
Shashi Tharoor

Updated on: Apr 19, 2022 | 1:08 AM

IPL 2022: టోర్నీ ఆరంభంలో వరుసగా పరాజయాలు ఎదుర్కొన్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (SRH) ఇప్పుడు చెలరేగిపోతోంది. గోడకు కొట్టిన బంతిలా వరుసగా విజయాలు సాధిస్తోంది. ముఖ్యంగా ఆ జట్టు తరఫున ఆడుతున్న స్పీడ్‌స్టర్‌ ఉమ్రాన్‌ మాలిక్‌ (Umran Malik) హైదరాబాద్‌ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. నిలకడగా గంటకు 150 కిలోమీటర్లకు పైగా వేగంతో అతను పదునైన బంతులకు ప్రత్యర్థి బ్యాటర్ల దగ్గర సమాధానం లేకుండా పోతోంది. ముఖ్యంగా కోల్‌కతాతో జరిగిన గత మ్యాచ్‌లో అద్భుతమైన యార్కర్‌తో శ్రేయస్‌ అయ్యర్‌ను క్లీన్‌బౌల్డ్‌ చేసిన తీరు అందరినీ ఆకట్టుకుంది. ఇక ఆదివారం పంజాబ్‌కు తన పేస్‌ బౌలింగ్‌ రుచి చూపించాడు ఈ స్పీడ్‌స్టర్‌. ఈ మ్యాచ్‌లో ఏకంగా నాలుగు వికెట్లు పడగొట్టి ప్లేయర్‌ ఆఫ్ ది మ్యాచ్‌ పురస్కారం దక్కించుకున్నాడు. ముఖ్యంగా పంజాబ్‌ ఇన్నింగ్స్‌ చివరి ఓవర్‌లో ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా 3 వికెట్లు తీసి అందరినీ ఆశ్చర్యపరిచాడు ఉమ్రాన్‌. తద్వారా ఐపీఎల్‌ చరిత్రలోనే చివరి ఓవర్‌ను మెయిడిన్‌గా ముగించిన నాలుగో బౌలర్‌గా అవతరించాడు. ఈనేపథ్యంలో ఈ స్పీడ్‌గన్‌ బౌలింగ్‌కు పలువురు మాజీ క్రికెటర్లు ఫిదా అవుతున్నారు. తాజాగా ప్రముఖ కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ (Shashi Tharoor) కూడా ఉమ్రాన్‌ బౌలింగ్‌కు ముగ్ధులయ్యారు. అతడిని వెంటనే టీమిండియాలోకి తీసుకోవాలంటూ ట్విట్టర్‌ వేదికగా ప్రశంసలు కురిపించారు.

‘ఉమ్రాన్‌ మాలిక్‌ను త్వరగా టీమిండియా జట్టులోకి తీసుకోవాలి. అతడిలో ఉడుకు రక్తం ఉరకలేస్తోంది. అందుకే అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. టెస్టు మ్యాచ్‌ల కోసం అతడిని ఇంగ్లాండ్‌కు తీసుకెళ్లండి. బుమ్రాతో అతడు కలిసి బౌలింగ్ చేస్తే ఆంగ్లేయులు బెంబేలెత్తిపోతారు’ అంటూ ట్విట్టర్‌లో రాసుకొచ్చారు శశి థరూర్‌. కాగా జమ్మూకు చెందిన ఉమ్రాన్‌ ఐపీఎల్‌-2021లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున అరంగేట్రం చేశాడు. కేవలం మూడు మ్యాచ్‌లే ఆడినప్పటికీ గంటకి 151.03 కిలోమీటర్ల వేగంతో బంతిని విసిరి టాప్‌ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. అందుకే ఐపీఎల్‌-2022 మెగా వేలానికి ముందే రూ. 4 కోట్లు పెట్టి మళ్లీ రిటైన్‌ చేసుకుంది ఎస్‌ఆర్‌హెచ్‌ యాజమాన్యం .

Also Read:IPL 2022: ఉత్కంఠ పోరులో గుజరాత్‌ను వరించిన విజయం.. ఒంటి చేతితో మ్యాచ్‌ను గెలిపించిన డెవిడ్‌ మిల్లర్..

పుత్రోత్సాహంలో నటుడు మాధవన్..

ICICI Insurance: బంపర్ రిజల్ట్స్ ప్రకటించిన ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ కంపెనీ.. లాభం రెండితలు..

Loading...
Unable to load recommendations.
Follow Us