Virat Kohli: టెస్టుల్లో కింగ్ కోహ్లీ రికార్డులివే.. ఆ ఒక్క దాని కోసమైనా కొద్ది రోజులు ఆగాల్సింది

టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. తన 14 ఏళ్ల టెస్ట్ కెరీర్‌కు ముగింపు పలుకుతున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. ఇది కోహ్లీ అభిమానులతో పాటు సగటు క్రికెట్ ఫ్యాన్స్ ను షాక్ కు గురి చేసింది.

Virat Kohli: టెస్టుల్లో కింగ్ కోహ్లీ రికార్డులివే.. ఆ ఒక్క దాని కోసమైనా కొద్ది రోజులు ఆగాల్సింది
Virat Kohli

Updated on: May 12, 2025 | 1:07 PM

గత కొన్ని రోజులుగా జరుగుతున్న రూమర్లను నిజం చేస్తూ టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ టెస్టులకు వీడ్కోలు పలికాడు. తన రిటైర్మెంట్ గురించి విరాట్ కోహ్లీ సోషల్ మీడియాలో తెలియజేశాడు. ‘ సుమారు 14 ఏళ్ల క్రితం మొదటిసారి వైట్ జెర్సీ ధరించాను. ఈ ఫార్మాట్ లో నేను ఇంతకాలం కొనసాగుతానని అసలూ ఊహించలేదు. టెస్ట్ క్రికెట్ ఆడడం నాకు ఎప్పుడూ ప్రత్యేకమే. నాకెన్నో పరీక్షలు పెట్టి పాఠాలు నేర్పించింది. ఈ ఫార్మాట్ తో నాకెన్నో మధురమైన జ్ఞాపకాలు, అనుభవాలు ఉన్నాయి. అలాంటి ఈ టెస్ట్ క్రికెట్ ను వదిలేయడమనేది చిన్న విషయం కాదు. కానీ నా నిర్ణయం సరైందనే అనిపిస్తోంది. టెస్ట్ క్రికెట్ కు నేను ఎంతో చేశాను. అలాగే నేను ఆశించిన దానికంటే ఎక్కువే ఇది నాకు తిరిగిచ్చింది. మనసు నిండా సంతృప్తితో, కృతజ్ఞతాభావంతో దీన్ని నుంచి తప్పుకుంటున్నా. ప్రేమతో ఇక సైనింగ్‌ ఆఫ్‌’ అని కోహ్లీ తన రిటైర్మెంట్ సందేశంలో పేర్కొన్నాడు.

10 వేల ప‌రుగుల రికార్డ్ మిస్సింగ్..

విరాట్ కోహ్లీ ఇప్ప‌టి వ‌ర‌కు 123 టెస్టుల్లో 46.9 స‌గ‌టుతో 9230 ప‌రుగులు సాధించాడు. ఇందులో 30 సెంచ‌రీలు 31 హాఫ్ సెంచ‌రీలు ఉన్నాయి. అత్యధిక స్కోర్‌ 254 నాటౌట్‌. ఈ ఫార్మాట్ లో కోహ్లీ మ‌రో 770 ప‌రుగులు చేసి ఉంటే 10 వేల ప‌రుగులు మైలురాయిని చేరుకునే వాడు. టెస్ట్ క్రికెట్ లో ఇప్పటివరకు మొత్తం ముగ్గురు భారతీయ క్రికెటర్లు మాత్రమే 10వేల పరుగుల మైలురాయిని అందుకున్నారు. సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, సునీల్ గవాస్కర్ ఈ జాబితాలో ఉన్నారు. కోహ్లీ కూడా ఈ జాబితాలో చేరుతాడని క్రికెట్ అభిమానులు భావించారు. కానీ అంతుకు ముందే కింగ్ రిటైర్మెంట్ ప్రకటించాడు.

టెస్ట్ క్రికెట్ లో కింగ్ కోహ్లీ అరుదైన రికార్డులు…

  • బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా 2014లో అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో కోహ్లీ మొదటి ఇన్నింగ్స్‌లో 115, రెండవ ఇన్నింగ్స్‌లో 141 పరుగులు సాధించాడు. భారత్ ఈ మ్యాచ్‌లో ఓడిపోయినా, కోహ్లీ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ శతకాలు సాధించిన భారత ఆటగాడిగా నిలిచాడు.
  • 2014 నుంచి 2022 వరకు టెస్ట్ కెప్టెన్‌గా ఉన్నకింగ్ కోహ్లీ 68 మ్యాచ్‌లకు నాయకత్వం వహించాడు. ఇందులో 40 విజయాలు, 17 ఓటములు ఉన్నాయి. అతని విజయాల శాతం 58.82గా ఉంది.
  • 2016లో ముంబైలోని వాంఖడే వేదికగా ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లో కోహ్లీ (235 ప‌రుగులు), జయంత్ యాదవ్ (104 ప‌రుగులు) కలిసి ఎనిమిదో వికెట్‌కు 241 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఇది భారత టెస్ట్ చరిత్రలో అత్యధిక ఎనిమిదో వికెట్ భాగస్వామ్యం.
  • 2019లో పుణే వేదికగా దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో కోహ్లీ తన 7000వ టెస్ట్ పరుగును పూర్తి చేశాడు. కేవలం 138 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాధించడం విశేషం. ఆ మ్యాచ్‌లో అజేయ 254 పరుగుల ఇన్నింగ్స్‌తో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు కింగ్ కోహ్లీ.
  • భారత్ తరపున ఒక టెస్ట్ సిరీస్‌లో అత్యధిక డబుల్ సెంచరీలు చేసిన రికార్డు కోహ్లీ పేరిట ఉంది. 2017-18లో శ్రీలంకతో జరిగిన మూడు టెస్ట్‌ల సిరీస్‌లో ఐదు ఇన్నింగ్స్‌లలో రెండు డబుల్ సెంచరీలు చేశాడు.
  • భారత్ తరపున టెస్ట్ సిరీస్‌లో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డును కోహ్లీ సొంతం. 2014-15లో ఆస్ట్రేలియా పర్యటనలో కోహ్లీ ఈ ఘనత సాధించాడు. ఈ సిరీస్‌లోని నాలుగు మ్యాచ్‌లలో ఎనిమిది ఇన్నింగ్స్‌లలో 692 పరుగులు చేశాడు.

 

ఇవి కూడా చదవండి

ఇవి టెస్ట్ క్రికెట్ లో కింగ్ కోహ్లీ సాధించిన కొన్ని రికార్డులు మాత్రమే. ఇవి గాక ఒక క్యాలెండర్ సంవత్సరంలో అత్యధిక పరుగులు (1322), ఒక కెప్టెన్ చేసిన సిరీస్‌లో అత్యధిక పరుగులు (655), అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు (3), త్యధిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు (10).. ఇలా చెప్పుకుంటూ పోతే కింగ్ కోహ్లీ రికార్డులపై ఒక పుస్తకమే రాయవచ్చు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..