17 సీజన్లు.. అయినా మారని తలరాత. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుది అదే పాత కథ. ఐపీఎల్ 2024లో ఏడు పరాజయాలు చవిచూసి.. ప్లేఆఫ్స్ రేసు నుంచి అవుట్ అయినట్టే అనుకున్న సమయంలో అనూహ్యంగా కంబ్యాక్ ఇచ్చి.. టాప్-4కి చేరుకుంది. అయితేనేం ఎలిమినేటర్ మ్యాచ్లో పేలవ ఆటతీరు కనబరిచి.. టోర్నమెంట్ నుంచి అవుట్ అయింది. దీంతో ఆర్సీబీ పదిహేడేళ్ల కల.. మళ్లీ కలగానే మిగిలిపోయింది. ఈ సీజన్లో విరాట్ కోహ్లీ 15 ఇన్నింగ్స్లో 741 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు. అయినా ఏం లాభం లేకపోయింది. ఈ తరుణంలో ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీ ఇప్పటికైనా ఆర్సీబీ జట్టును వదిలిపెట్టాలని సూచించాడు.
‘ట్రోఫీ గెలవడంలో భాగంగా విరాట్ కోహ్లీ ఎంతగానో కష్టపడ్డాడు. ఆరెంజ్ క్యాప్ కూడా సాధించాడు. ఫ్రాంచైజీకి తాను ఎంతో చేశాడు. అయినా కూడా ఆర్సీబీ టైటిల్ గెలవలేదు. బ్రాండ్వాల్యూ పరంగా ఫ్రాంఛైజీతో కోహ్లి బంధం అమోఘం. అయినప్పటికీ కోహ్లీ టైటిల్ను గెలవడానికి అర్హుడు. ఇప్పటికైనా టైటిల్ గెలిచే సత్తా ఉన్న టీమ్లోకి అతడు వెళ్లాలి. వచ్చే ఏడాది ఢిల్లీ క్యాపిటల్స్కు విరాట్ కోహ్లీ మారిపోవాలని సూచించాడు. తన సొంతగడ్డకు చెందిన ఫ్రాంచైజీకి అతడు ప్రాతినిధ్యం వహిస్తే బాగుంటుంది. బెక్హాం, రోనాల్డో, మెస్సీ లాంటివారు ఇలా మారిన విషయం తెలిసిందే’ అని కెవిన్ పీటర్సన్ పేర్కొన్నాడు. కాగా, 2008 నుంచి ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు విరాట్ కోహ్లీ ప్రాతినిధ్యం వహిస్తోన్న సంగతి తెలిసిందే.