వరల్డ్కప్లో టీమిండియా సెమీస్కు అడుగు దూరంలో ఉంది. ఆదివారం ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో భారత్ ఓడిపోయినా.. ఆ ఓటమి జట్టుపై ప్రభావం చూపలేదు. వరుస విజయాలు, టాప్ ఆర్డర్ ప్లేయర్స్ ఫామ్.. భారత్ జట్టుకు కలిసివచ్చే అంశం. ఇది ఇలా ఉండగా టీమిండియాను ఆటగాళ్ల గాయాలు తెగ వేధిస్తున్నాయి. తొలుత ఓపెనర్ శిఖర్ ధావన్ గాయపడగా.. ఆ తర్వాత భువనేశ్వర్ కుమార్ గాయపడ్డాడు. ఇప్పుడు ఆ జాబితాలోకి విజయ్ శంకర్ చేరాడు.
తాజాగా విజయ్ శంకర్ ప్రాక్టీస్ చేస్తుండగా.. గాయపడ్డాడు. అయితే అతని స్థానంలో ఎవరూ ఊహించని విధంగా కర్ణాటక బ్యాట్స్మెన్ మయాంక్ అగర్వాల్ని జట్టులోకి తీసుకుంటున్నట్లు ప్రకటించింది బీసీసీఐ. ఈ ప్రతిపాదనని ఐసీసీ టెక్నికల్ కమిటీ కూడా ఆమోదించింది. ఇది ఇలా ఉంటే ఎవరైనా ఆటగాడు గాయంతో వైదొలిగితే అతడి స్థానంలో అంబటి రాయుడిని జట్టులోకి తీసుకుంటారని అందరూ భావించారు. కానీ బీసీసీఐ మాత్రం అందుకు విరుద్ధంగా నిర్ణయం తీసుకుంది. దీనికి క్రికెట్ అభిమానుల నుంచి మాజీల వరకు అందరూ కూడా షాక్ అయ్యారని చెప్పవచ్చు. అయితే రాయుడిని జట్టులోకి తీసుకోకపోవడానికి ముఖ్య కారణం ప్రపంచకప్కి ముందు అతడు చేసిన ట్వీటేనని నెటిజన్లు అంటున్నారు.
ప్రపంచకప్లో తనకు చోటు దక్కకపోవడంతో రాయుడు సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘‘ప్రపంచకప్ చూసేందుకు త్రీడి కళ్లద్దాలు ఆర్డర్ చేస్తా’’ అంటూ వ్యంగ్యంగా ఎంఎస్కె ప్రసాద్ను ఉద్దేశించి ట్వీట్ చేశాడు. అయితే ఈ ట్వీట్పై కొందరు విమర్శలు చేయగా.. మరికొందరు రాయుడికి మద్దతు తెలిపారు.
ఇప్పుడు ఆ ట్వీటే రాయుడి కొంపముంచిందంటూ నెటిజన్లు తమ అభిప్రాయాన్ని తెలుపుతున్నారు. ఒకవేళ రాయుడు అలా ట్వీట్ చేయకపోయి ఉంటే.. అతనికి జట్టులో చోటు దక్కేదని అంటున్నారు. ప్రపంచకప్ కోసం ప్రకటించిన బ్యాక్ఆప్ ప్లేయర్ల లిస్ట్లో మయాంక్ పేరు లేకున్నా.. అతన్ని జట్టులోకి తీసుకున్న బీసీసీఐ.. కావాలనే రాయుడి మీద కక్ష కట్టి ఎంపిక చేసిందని మరికొందరు భావిస్తున్నారు.