
దుబాయ్లో జరిగిన అండర్-19 ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ భారత్, పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్వేగాల మధ్య సాగింది. ఈ హై-వోల్టేజ్ పోరులో భారత సంచలన బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ, పాకిస్థాన్ పేసర్ అలీ రజా మధ్య జరిగిన మైదాన పోరు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
పాకిస్థాన్ నిర్దేశించిన 348 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో భారత్ ఇన్నింగ్స్ ఆరంభించినప్పుడు, 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ధాటిగా ఆడాడు. ఎదుర్కొన్న మొదటి 9 బంతుల్లోనే 24 పరుగులు చేసి మంచి ఊపు మీద కనిపించాడు. అయితే, అలీ రజా వేసిన ఒక షార్ట్ పిచ్ బంతిని పంచ్ చేయబోయి వికెట్ కీపర్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
Vaibhav Suryavanshi just following his seniors 💀#INDvsPAK
— Sarcasm (@sarcastic_us) December 21, 2025
వైభవ్ అవుటైన వెంటనే అలీ రజా అతడికి చాలా కోపంగా ‘సెండ్ ఆఫ్’ ఇచ్చాడు. క్రీజు వదిలి వెళ్తున్న వైభవ్ను ఉద్దేశించి రజా ఏదో వ్యాఖ్యలు చేశాడు. సాధారణంగా సైలెంట్గా ఉండే వైభవ్, ఈసారి వెనక్కి తగ్గలేదు. పాక్ ఆటగాళ్లతో వాగ్వాదానికి దిగాడు. ఆ సమయంలో వైభవ్ తన షూ వైపు వేలు చూపిస్తూ (షూ కింద ఉంటారు అన్నట్లుగా) సైగలు చేస్తూ కౌంటర్ ఇచ్చాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ జట్టులో సమీర్ మిన్హాస్ (172 పరుగులు) అద్భుత సెంచరీతో రాణించడంతో ఆ జట్టు 347 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో వైభవ్ సూర్యవంశీ అవుటైన తర్వాత భారత బ్యాటింగ్ లైనప్ కుప్పకూలింది. టీమిండియా కేవలం 156 పరుగులకే ఆలౌట్ కావడంతో, పాకిస్థాన్ 191 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించి ఆసియా కప్ టైటిల్ను సొంతం చేసుకుంది.
భారత జట్టు ఓడిపోయినప్పటికీ, మైదానంలో స్లెడ్జింగ్కు దిగిన ప్రత్యర్థి ఆటగాళ్లకు వైభవ్ ఇచ్చిన సమాధానంపై భారత అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..