
Watch : కేవలం 15 ఏళ్ల వయసులోనే అసాధారణ ప్రతిభతో దూసుకుపోతున్న యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారాడు. ప్రస్తుతం ఇండియా ‘ఏ’ జట్టుతో కలిసి శ్రీలంక పర్యటనలో ఉన్న ఇతగాడికి అక్కడ ఊహించని స్థాయిలో అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు. ట్రై సిరీస్లో భాగంగా శ్రీలంక-ఏ జట్టుతో జరిగిన ఉత్కంఠభరితమైన మొదటి మ్యాచ్లో టీమిండియా ఘనవిజయం సాధించిన తర్వాత, స్టేడియం వెలుపల వైభవ్కు ఎదురైన అనుభవానికి సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ను ఊపేస్తోంది.
మ్యాచ్ ముగిసిన అనంతరం భారత ఆటగాళ్లంతా స్టేడియం నుంచి బయటకు వచ్చి హోటల్కు వెళ్తున్న సమయంలో ఈ ఆసక్తికర ఘటన జరిగింది. టీమిండియా స్టార్ ఆటగాళ్లు, ఐపీఎల్ హీరోలైన కెప్టెన్ తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్, ప్రియాంశ్ ఆర్య వంటి పెద్ద పెద్ద ప్లేయర్స్ అభిమానుల ముందు నుంచే చాలా సాధారణంగా నడుచుకుంటూ వెళ్ళిపోయారు. కానీ అందరి కంటే చివర్లో వస్తున్న 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీని చూడగానే స్టేడియం వెలుపల వేచి ఉన్న అభిమానులంతా ఒక్కసారిగా అతని వైపు దూసుకొచ్చారు. ఆ పెద్ద స్టార్లను వదిలేసి, ఈ చిన్న కుర్రాడితో సెల్ఫీలు దిగడానికి పోటీ పడ్డారు.
అభిమానులు ఒకరి తర్వాత ఒకరు చుట్టుముట్టేసి సెల్ఫీల కోసం ఎగబడుతుండటంతో వైభవ్ కాస్త ఇబ్బంది పడ్డాడు. అందరికీ విడివిడిగా ఫోటోలు ఇవ్వడం సాధ్యం కాకపోవడంతో.. చివరకు ఆ చిన్నారి క్రికెటరే స్పందిస్తూ “దయచేసి మీరంతా ఒకేసారి గ్రూప్గా రండి, అందరం కలిసి ఒకే ఫోటో దిగుదాం” అని అభిమానులను కోరాల్సి వచ్చింది. ఈ క్యూట్ అండ్ క్రేజీ మూమెంట్కు సంబంధించిన వీడియోను ఒక నెటిజన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అది కాస్తా క్షణాల్లో వైరల్గా మారింది. పెద్ద పెద్ద ఆటగాళ్లను పక్కనబెట్టి ఫ్యాన్స్ వైభవ్కు ఇచ్చిన ప్రాధాన్యత చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
Vaibhav Suryavanshi has already become a superstar. After the match, the entire India A team was arriving, including Ruturaj, Tilak, Priyansh Arya, and other big names, but the fans were waiting for Vaibhav Suryavanshi to take pictures with him.🫡🔥
15-year-old boy, the new… pic.twitter.com/NcdWT8rEB6
— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) June 9, 2026
నిజానికి వైభవ్ సూర్యవంశీ కేవలం ఈ ఒక్క మ్యాచ్తో పాపులర్ అవ్వలేదు. భారత జాతీయ క్రికెట్ జట్టుకు ఎంపికైన అత్యంత పిన్న వయస్కుడిగా అతను ఇప్పటికే చరిత్ర సృష్టించాడు. అతని అద్భుతమైన బ్యాటింగ్ టెక్నిక్ చూసి సెలెక్టర్లు ఫిదా అయిపోయారు. అందుకే అతడిని ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలతో పాటు రాబోయే ఏషియన్ గేమ్స్ భారత జట్టు స్క్వాడ్కు కూడా ఎంపిక చేశారు. రోజురోజుకూ పెరుగుతున్న అతని పాపులారిటీ చూస్తుంటే.. టీమిండియాకు తదుపరి సూపర్ స్టార్ దొరికేసాడని విశ్లేషకులు గట్టిగా చెప్తున్నారు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. శ్రీలంక-ఏ జట్టుతో జరిగిన ఈ మొదటి పోరులో ఇండియా-ఏ జట్టు 8 పరుగుల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. అయితే ఈ మ్యాచ్లో ఓపెనర్గా వచ్చిన వైభవ్ సూర్యవంశీ పెద్దగా రాణించలేకపోయాడు. కేవలం 14 పరుగులు మాత్రమే చేసి తక్కువ స్కోరుకే అవుట్ అయ్యాడు. ఒకానొక దశలో ఇండియా ఈ మ్యాచ్ ఓడిపోయేలా కనిపించింది. కానీ భారత బౌలర్ అర్షద్ ఖాన్ 49వ ఓవర్లో అద్భుతమైన బౌలింగ్తో వరుసగా 3 వికెట్లు పడగొట్టి మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. మ్యాచ్లో వైభవ్ ఫెయిల్ అయినా.. అతనికున్న క్రేజ్ మాత్రం రవ్వంత కూడా తగ్గకపోవడం విశేషం.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..