
T20 Leagues Ban : ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో ఫ్రాంచైజీ లీగ్ల హవా నడుస్తోంది. 2008లో బీసీసీఐ ప్రారంభించిన ఐపీఎల్ తెచ్చిన భారీ సక్సెస్తో.. ప్రపంచవ్యాప్తంగా దాదాపు ప్రతి దేశం తమ సొంత టీ20 లీగ్లను మొదలుపెట్టాయి. అయితే ఈ లీగ్ల వల్ల అంతర్జాతీయ క్రికెట్ క్యాలెండర్ పూర్తిగా దెబ్బతింటోంది. ఆటగాళ్లు కూడా దేశం కంటే డబ్బులు ఎక్కువగా వచ్చే లీగ్లకే ప్రాధాన్యత ఇస్తూ ఫ్రీలాన్సర్లుగా మారిపోతున్నారు. ఈ పరిస్థితిని సీరియస్గా తీసుకున్న ఐసీసీ, లీగ్లు, అంతర్జాతీయ మ్యాచ్లు రెండూ కలిసి సాగేలా కొన్ని కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధమైంది. ఇందులో భాగంగానే అవినీతి, ఆర్థిక మోసాలు జరుగుతున్న మూడు ప్రముఖ టీ20 లీగ్లను ఐసీసీ పూర్తిగా నిషేధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
1. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (BPL)లో ఆర్థిక అక్రమాలు
ఐసీసీ రాడార్లో మొదటిగా కనిపిస్తున్న లీగ్ బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (BPL). ఈ 2025/26 సీజన్లో ఈ లీగ్లో విపరీతమైన ఆర్థిక అవకతవకలు జరిగినట్లు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు తమీమ్ ఇక్బాల్ స్వయంగా వెల్లడించారు. టోర్నమెంట్ జరుగుతున్న సమయంలో ఫ్రాంచైజీ యజమానులు తమకు జీతాలు ఇవ్వడం లేదంటూ అటు స్వదేశీ ప్లేయర్లు, ఇటు విదేశీ ప్లేయర్లు రోడ్డెక్కి బహిరంగంగా నిరసనలు చేశారు. వీటికి తోడు గత రెండేళ్లుగా బీపీఎల్లో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు కూడా పెరిగిపోవడంతో ఐసీసీ యాంటీ కరప్షన్ యూనిట్ దీనిపై ప్రత్యేక నిఘా పెట్టింది. అంతర్జాతీయ మ్యాచ్ల సమయంలోనే ఈ లీగ్ జరగడం కూడా ఐసీసీ ఆగ్రహానికి మరో కారణం.
2. గ్లోబల్ టీ20 కెనడా (GT20 Canada)లో అవినీతి భూతం
కెనడా క్రికెట్ బోర్డు ప్రస్తుతం ఐసీసీ నుంచి తీవ్రమైన విచారణను ఎదుర్కొంటోంది. 2026 టీ20 ప్రపంచకప్లో జరిగిన ఒక మ్యాచ్ ఫిక్సింగ్ స్కాండల్ తర్వాత ఈ బోర్డు గుట్టు రట్టయింది. కేవలం ఫిక్సింగే కాకుండా, బోర్డు సీఈఓకి సంబంధించిన దొంగతనాలు, భారీ ఆర్థిక మోసాల ఆరోపణల నేపథ్యంలో ఐసీసీ ఇప్పటికే కెనడా క్రికెట్ బోర్డును సస్పెండ్ చేసింది. అక్కడ జరుగుతున్న గ్లోబల్ టీ20 కెనడా లీగ్లో కూడా గతంలో ప్లేయర్లకు జీతాలు ఇవ్వకపోవడంతో వారు మ్యాచ్లు ఆడటానికి నిరాకరించిన ఘటనలు ఉన్నాయి. కెనడా క్రికెట్ మెంబర్షిప్ వివాదం తేలేవరకు ఈ టోర్నమెంట్ను రద్దు చేయాలని ఐసీసీ భావిస్తోంది.
3. లంక ప్రీమియర్ లీగ్ (LPL)కు ఫ్రాంచైజీల టెన్షన్
శ్రీలంకలో జరిగే లంక ప్రీమియర్ లీగ్ (LPL) కూడా ఐసీసీ బ్యాన్ లిస్టులో ఉండేలా కనిపిస్తోంది. 2025లో జరగాల్సిన ఈ లీగ్.. 2026 టీ20 వరల్డ్ కప్ వేదికల పునరుద్ధరణ కోసం పలుమార్లు వాయిదా పడి, చివరకు ఈ ఏడాది జూలై, ఆగస్టులలో నిర్వహించేందుకు ప్లాన్ చేశారు. అయితే ఎల్పీఎల్ ప్రారంభం నుంచి ఆర్థిక సమస్యలతో సతమతమవుతోంది. ఒప్పందం ప్రకారం ఆటగాళ్లకు డబ్బులు చెల్లించనందుకు గానూ ఇటీవలే జాఫ్నా కింగ్స్, కొలంబో స్ట్రైకర్స్ జట్ల ఓనర్లను బోర్డు తొలగించింది. ఈ లీగ్ బ్రాండ్ వాల్యూ చాలా తక్కువగా ఉండటం, అలాగే ఇంగ్లాండ్కు చెందిన ది హండ్రెడ్ లీగ్తో ఇది తలపడటం వల్ల దీనికి టీవీ రెవెన్యూ కూడా రావడం లేదు. ఐపీఎల్ ముగిసిన నెల రోజులకే ఇది జరగడం వల్ల ప్లేయర్ల లభ్యత కోసం లంక బోర్డు దీనిపై కఠిన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.ల
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..