
ఐసీసీ అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్ లో తెలంగాణ తేజం గొంగడి త్రిష చరిత్ర సృష్టించింది. స్కాట్లాండ్తో జరుగుతున్న మ్యాచ్లో ఆమె కేవలం 50 బంతుల్లోనే మెరుపు సెంచరీ సాధించింది. తద్వారా అండర్ 19 మహిళల టీ20 వరల్డ్ కప్ లో సెంచరీ సాధించిన తొలి ప్లేయర్ గా రికార్డు పుటలకెక్కింది. ఈ మ్యాచ్లో త్రిష 53 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేసుకుంది. ఈ మ్యాచ్లో మొత్తంగా 59 బంతులు ఎదుర్కొన్న త్రిష 13 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 110 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. ఫలితంగా మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో వికెట్ నష్టానికి 208 పరుగుల రికార్డు స్కోర్ చేసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కి చెందిన త్రిష ఈ టోర్నీలో టాప్ స్కోరర్ గా కొనసాగుతోంది. ఈ 110 పరుగులతో ఐసీసీ అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్ ప్రస్తుత సీజన్లో త్రిష స్కోరు 230 పరుగులకు చేరుకుంది.
19 ఏళ్ల త్రిష తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలంలో పుట్టింది. రైట్ హ్యాండ్ బ్యాటింగ్తో పాటు రైట్ ఆర్మ్ లెగ్ బ్రేక్ బౌలింగ్ కూడా వేసే త్రిష దేశవాలీ క్రికెట్లో హైదరాబాద్కు ప్రాతినిథ్యం వహించింది. ఇప్పుడు మలేషియా వేదికగా జరుగుతోన్న ఐసీసీ అండర్ 19 మహిళల టీ20 ప్రపంచకప్ లో భారీగా పరుగులు సాధిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
కాగా ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమిండియా మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది ఓపెనర్లు త్రిష – కమలిని కలిసి తొలి వికెట్కు 147 పరుగులు జోడించారు. అర్ధ సెంచరీ తర్వాత కమలిని ఔటైనా.. త్రిష దూకుడు మాత్రం ఆగలేదు. సానికాతో కలిసి చివరి వరకూ క్రీజ్లో ఉన్న త్రిష రెండో వికెట్కు 61 పరుగుల భాగస్వామ్యం నిర్మించింది. ఈ క్రమంలోనే మెరుపు సెంచరీ సాధించి చరిత్ర సృష్టించింది.
Trisha Gongadi etches her name in the record books with the first-ever century in Women’s #U19WorldCup history 🤩
➡️ https://t.co/t2l4pLxYCq pic.twitter.com/mdmKWXi2YG
— T20 World Cup (@T20WorldCup) January 28, 2025
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..