
టీమ్ ఇండియాలో ప్రయోగాల కాలం ఐర్లాండ్ పర్యటన వరకు మాత్రమే ఉంటుందని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఇటీవల చెప్పిన సంగతి తెలిసిందే. అయితే, ఇంగ్లండ్తో జరిగే టీ20 సిరీస్లో భారతదేశం దాదాపు అదే జట్టుతో ఆడుతుంది. ఈ ఏడాది అక్టోబర్లో ఆస్ట్రేలియాలో జరిగే ప్రపంచ కప్ ఉండడంతో, అదే టీంతో ఇంగ్లండ్లో ఆడడం కష్టంగా మారనుంది. ఎందుకంటే, ఆటగాళ్లను బాగా పరీక్షించేందుకు కూడా ఇదే మంచి సమయంగా బీసీసీఐ భావిస్తుంది. అప్పుడే ఆటగాళ్ల సామర్థ్యాలు బయటకు వస్తాయని అనుకుంటోంది. చాలా టైట్ షెడ్యూల్ కారణంగా, ఇంగ్లండ్తో జరిగే మూడు మ్యాచ్ల T20 సిరీస్లో భారత్ ప్రయోగాన్ని కొనసాగించాల్సి రావచ్చని తెలుస్తోంది. ఇదే జరిగితే, ఐర్లాండ్లాగే హార్దిక్ పాండ్యా అక్కడ కూడా కెప్టెన్గా వ్యవహరించడం చూడొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. ఇది ఎందుకు జరుగుతుందో ప్రస్తుతానికైతే ఎటువంటి సమాచారం లేదు.
టెస్ట్ మ్యాచ్ జులై 5న ముగుస్తుంది..
భారత ప్రధాన జట్టు జులై 1 నుంచి ఇంగ్లండ్తో రోహిత్ శర్మ కెప్టెన్సీలో టెస్ట్ మ్యాచ్ ఆడనుంది. ఈ టెస్టు పూర్తి అయిదు రోజుల పాటు సాగితే.. రోహిత్ సహా టెస్టు జట్టులోని ఆటగాళ్లు ఇంగ్లండ్తో తొలి టీ20లో ఆడడం కష్టమే. ఎందుకంటే తొలి టీ20 మ్యాచ్ జులై 7న మొదలు కానుంది. ఈ పరిస్థితిలో ఆటగాళ్లకు విశ్రాంతి లభించేది ఒక్కరోజే కావడంతో, హార్ధిక్ తొలి టీ20కి సారథిగా వ్యవహరించే ఛాన్స్ ఉంది. ఐర్లాండ్ తర్వాత ఇంగ్లండ్ వెళ్లాలని హార్దిక్ జట్టును బీసీసీ కోరింది. భారత ప్రధాన జట్టు ఇంగ్లండ్తో టెస్ట్ మ్యాచ్ ఆడనున్న సమయంలో, హార్దిక్ పాండ్యా సారథ్యంలోని భారత టీ20 జట్టు ఇంగ్లండ్ స్థానిక జట్లతో రెండు వార్మప్ మ్యాచ్లు ఆడనుంది.
టెస్టు త్వరగా ముగిస్తే ప్లాన్ మారే ఛాన్స్..
భారత్-ఇంగ్లండ్ టెస్టు మూడు, నాలుగు రోజుల్లో ముగిస్తే తొలి టీ20లో రోహిత్, విరాట్, బుమ్రా, షమీ వంటి ఆటగాళ్లను పరిగణనలోకి తీసుకోవచ్చు. అయితే దీని అంచనాలు తక్కువగానే ఉన్నాయని చెబుతున్నారు. ఇంగ్లండ్తో టీ20 సిరీస్కు బీసీసీఐ ఇంకా అధికారికంగా జట్టును ప్రకటించక పోవడం గమనార్హం.