
Cricket Sentiment : టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 పోరులో సౌతాఫ్రికా చేతిలో టీమిండియా ఘోరంగా ఓడిపోవడం కోట్లాది మంది అభిమానులను కలిచివేసింది. 76 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలవ్వడం, రన్ రేట్ దారుణంగా పడిపోవడంతో భారత్ ఇక ఇంటికేనా? అనే సందేహాలు మొదలయ్యాయి. కానీ క్రికెట్ చరిత్రను తరచి చూస్తే ఒక ఆసక్తికరమైన సెంటిమెంట్ ఇక్కడ కనిపిస్తోంది. ఒక్కోసారి గెలవాలంటే ఓడాలి.. అలా ఓడి గెలిచేవాడినే నిజమైన మొనగాడు అనే సినిమా డైలాగ్ ఇప్పుడు టీమిండియాకు అతికినట్టు సరిపోతుంది. ఈ ఓటమే భారత్ను విశ్వవిజేతగా నిలబెట్టబోతుందా? అంటే 19 ఏళ్ల క్రితం నాటి చరిత్ర అవుననే చెబుతోంది.
సరిగ్గా 19 ఏళ్ల క్రితం అంటే 2007లో జరిగిన తొలి టీ20 వరల్డ్ కప్లో కూడా టీమిండియా పరిస్థితి ఇట్టాగే ఉంది. అప్పుడు కూడా గ్రూప్ స్టేజ్లో అదరగొట్టిన భారత్, సెకండ్ రౌండ్ (సూపర్-8)లో తన తొలి మ్యాచ్ను న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయింది. ఆ ఓటమితో అప్పట్లో కూడా అందరూ భారత్ పని అయిపోయిందని అనుకున్నారు. కానీ అక్కడే అసలు మలుపు తిరిగింది. ఆ తర్వాత జరిగిన మ్యాచ్ల్లో ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికాలపై సంచలన విజయాలు సాధించి సెమీస్కు దూసుకెళ్లింది. ఆపై సెమీస్లో ఆస్ట్రేలియాను, ఫైనల్లో పాకిస్థాన్ను మట్టికరిపించి తొలి టీ20 ప్రపంచకప్ను ముద్దాడింది.
ప్రస్తుతం 2026 వరల్డ్ కప్లోనూ సీన్ అలాగే రిపీట్ అవుతోంది. సూపర్-8లో తొలి మ్యాచ్ను సౌతాఫ్రికాకు అప్పగించేసిన భారత్, ఇప్పుడు 2007 నాటి మ్యాజిక్ను రిపీట్ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు టీమిండియా ముందున్న లక్ష్యం ఒక్కటే.. తదుపరి రెండు మ్యాచ్ల్లో జింబాబ్వే, వెస్టిండీస్లను చిత్తుగా ఓడించడం. ఒకవేళ భారత్ ఈ రెండు మ్యాచ్ల్లో భారీ విజయాలు నమోదు చేస్తే, సెమీస్ చేరడం ఖాయం. అదే జరిగితే, 19 ఏళ్ల క్రితం నాటి ఓటమి సెంటిమెంట్ భారత్కు మళ్ళీ వరల్డ్ కప్ తెచ్చిపెడుతుందన్నమాట.
అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. జింబాబ్వే ప్రస్తుతం చాలా పటిష్టంగా కనిపిస్తోంది. ఆస్ట్రేలియానే ఇంటికి పంపిన జింబాబ్వేను తక్కువ అంచనా వేయడం భారత్కు ముప్పుగా మారవచ్చు. అలాగే వెస్టిండీస్ తన సొంత గడ్డపై ఎప్పుడూ ప్రమాదకరమే. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టు తన తప్పులను సరిదిద్దుకుని, 2007 నాటి ధోనీ సేన లాగా పోరాడితే, అహ్మదాబాద్లో పోయిన పరువును మళ్ళీ వరల్డ్ కప్ రూపంలో దక్కించుకోవచ్చు. చరిత్ర పునరావృతమవుతుందో లేదో చూడాలి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..