Team India : నీకో దండం సామీ.. టీమిండియా నుంచి ఆయనను వెంటనే తప్పించండి.. నెటిజన్ల డిమాండ్

Team India : ఐపీఎల్ 2026 లో విఫలమైన భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, ముంబై టీ20 లీగ్‌లోనూ 19 పరుగులకే అవుట్ అయ్యారు. ఆయనను జట్టు నుంచి తొలగించాలంటూ నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. సూర్య ఫామ్ కోల్పోవడం టీమిండియాకు పెద్ద మైనస్ అని కొందరు పెదవి విరుస్తున్నారు.

Team India : నీకో దండం సామీ.. టీమిండియా నుంచి ఆయనను వెంటనే తప్పించండి.. నెటిజన్ల డిమాండ్
Surya

Updated on: Jun 02, 2026 | 6:10 PM

Team India : భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫామ్ ప్రస్తుతం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఐపీఎల్ 2026 లో ముంబై ఇండియన్స్ తరఫున దారుణంగా విఫలమైన సూర్య.. ఆ చేదు జ్ఞాపకాలను మరువక ముందే మరో లీగ్‌లోనూ చేతులెత్తేశారు. జూన్ 1 నుంచి ప్రారంభమైన ముంబై టీ20 లీగ్‌లో ట్రయంఫ్ నైట్స్ ముంబై నార్త్ ఈస్ట్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న ఆయన.. తన మొదటి మ్యాచ్‌లోనే తీవ్రంగా నిరాశపరిచారు. ఒకప్పుడు మైదానంలో బౌలర్లను వణికించిన సూర్య.. వరుస వైఫల్యాలతో ఇప్పుడు నెటిజన్ల ట్రోలింగ్‌కు గురవుతున్నారు. ఆయన ఫామ్ కోల్పోవడంతో టీమిండియాలో ఆయన స్థానానికే ముప్పు వాటిల్లేలా కనిపిస్తోంది.

నార్త్ ముంబై పాంథర్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ట్రయంఫ్ నైట్స్ జట్టు 210 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగింది. అజింక్య రహానే నేతృత్వంలోని పాంథర్స్ బౌలర్ల ధాటికి.. ట్రయంఫ్ నైట్స్ జట్టు టాప్ ఆర్డర్ మొదటి మూడు ఓవర్లలోనే కుప్పకూలింది. ఈ దశలో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన సూర్యకుమార్ యాదవ్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దుతారని అందరూ ఆశించారు. కానీ కేవలం 11 బంతుల్లో 19 పరుగులు మాత్రమే చేసి ఆయన పెవిలియన్ చేరారు. రాహుల్ సావంత్ వేసిన ఏడో ఓవర్ ఐదో బంతికి స్వీప్ షాట్ ఆడబోయి, బ్యాక్‌వర్డ్ స్క్వేర్ లెగ్ బౌండరీలో ఉన్న ఫీల్డర్‌కు నేరుగా క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యారు. దీంతో సూర్య బ్యాటింగ్ కష్టాలు మరింత తీవ్రమయ్యాయి.

నిజానికి సూర్యకుమార్ యాదవ్‌కు ఐపీఎల్ 2026 సీజన్ ఏమాత్రం కలిసిరాలేదు. ఈ రెండున్నర నెలల టోర్నమెంట్‌లో ఆయన ఆడిన మ్యాచ్‌లలో కేవలం 20.77 సగటుతో 270 పరుగులు మాత్రమే చేయగలిగారు. ఇందులో ఆయన స్ట్రైక్ రేట్ 140 కి పైగా ఉన్నప్పటికీ.. ఒక స్టార్ ప్లేయర్ స్థాయికి తగ్గట్లుగా ఇన్నింగ్స్‌లు ఆడలేకపోయారు. ఈ సీజన్‌లో సూర్య నాలుగు సార్లు సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితం కాగా.. రెండు సార్లు గోల్డెన్ డక్‌గా వెనుదిరిగారు. ఢిల్లీపై 51 పరుగులు, రాజస్థాన్‌పై 60 పరుగులు మినహా.. మిగిలిన మ్యాచ్‌లలో 16, 33, 15, 21, 12 వంటి పేలవమైన స్కోర్లతో అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేశారు. ఆయన వైఫల్యాల వల్ల ముంబై ఇండియన్స్ జట్టు పాయింట్ల పట్టికలో 9వ స్థానంతో లీగ్ స్టేజ్ నుంచే నిష్క్రమించింది.

సూర్య వరుసగా విఫలమవుతుండటంతో సోషల్ మీడియాలో నెటిజన్లు ఆయనపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. టీ20 వరల్డ్ కప్ 2026, ఐపీఎల్ 2026లతో పాటు ఇప్పుడు లోకల్ లీగ్‌లోనూ సూర్య ఫామ్ కోల్పోవడం టీమిండియాకు పెద్ద మైనస్ అని కొందరు పెదవి విరుస్తున్నారు. భారత జట్టులో ప్రతి స్థానానికి విపరీతమైన పోటీ ఉందని, కేవలం పాత రికార్డులను చూసి జట్టులో చోటు కల్పించలేరని క్రీడాభిమానులు X వేదికగా కామెంట్లు పెడుతున్నారు. సూర్య త్వరగా ఫామ్ అందుకోకపోతే జట్టులో స్థానం కోల్పోవడం ఖాయమని హెచ్చరిస్తున్నారు.

వరుస వైఫల్యాల నేపథ్యంలో సూర్యకుమార్ యాదవ్‌కు సెలెక్టర్లు షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. జపాన్‌లో జరగబోయే 2026 ఏషియన్ గేమ్స్ కోసం బీసీసీఐ.. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్‌కు సమర్పించిన ప్రాథమిక జట్టులో సూర్య పేరును మినహాయించినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇది సూర్య కెరీర్ పతనానికి ఆరంభమని విశ్లేషకులు భావిస్తున్నారు. అంతేకాకుండా, టీమిండియా టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి కూడా సూర్యను తప్పించి.. ఆ బాధ్యతలను శ్రేయస్ అయ్యర్ లేదా సంజూ శాంసన్‌లకు అప్పగించే ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒకప్పుడు భారత జట్టులో ఒక వెలుగు వెలిగిన ఈ నయా స్టార్.. ఇప్పుడు ఫామ్ లేమితో తీవ్ర సవాలును ఎదుర్కొంటున్నారు.

 

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us