
Sunil Gavaskar On Vaibhav Suryavanshi: శ్రీలంక ‘ఎ’ జట్టుతో జరిగిన ట్రై సిరీస్ ఫైనల్ పోరులో భారత యువ సంచలనం, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. లంక బౌలర్లను ముప్పతిప్పలు పెడుతూ క్రికెట్ చరిత్రలోనే అరుదైన రికార్డును నెలకొల్పాడు. ఈ యువ కిశోరం సృష్టించిన విధ్వంసంపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
గత మ్యాచ్లలో శ్రీలంక ఆటగాళ్లు తనను మాటలతో కవ్వించిన విధానాన్ని మనసులో పెట్టుకున్నాడో ఏమో గానీ, వైభవ్ సూర్యవంశీ ఫైనల్ మ్యాచ్లో లంక బౌలర్లపై పగ తీర్చుకున్నాడు. మైదానంలోకి దిగిన క్షణం నుంచే బౌండరీల వర్షం కురిపించాడు. లిస్ట్ ‘ఎ’ క్రికెట్ చరిత్రలోనే ఎవరికీ సాధ్యం కాని రీతిలో కేవలం 11 బంతుల్లోనే అర్థ సెంచరీ (హాఫ్ సెంచరీ) మార్కును అందుకొని ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. శ్రీలంక బౌలింగ్ దాడిని పూర్తిగా చిన్నాభిన్నం చేస్తూ లంక ఆటగాళ్లకు మైదానంలోనే చుక్కలు చూపించాడు.
#VaibhavSuryavanshi
Absolutely Brilliant+Monster11 balls Fifty pic.twitter.com/HN7HEEIWvJ
— Mr_Platonicc (@Mr_Platonicc) June 21, 2026
వైభవ్ ఆడిన ఈ తుఫాన్ ఇన్నింగ్స్పై లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ స్పందిస్తూ శ్రీలంక జట్టుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మొన్నటి గ్రూప్ స్టేజ్ మ్యాచ్లలో శ్రీలంక ఆటగాళ్లు అనవసరంగా వైభవ్ సూర్యవంశీని రెచ్చగొట్టారని, ఆ తప్పుకు ప్రతిఫలమే లంక జట్టు ఇవాళ అనుభవిస్తోందని మండిపడ్డారు. ఆ రోజు గనుక ఈ 15 ఏళ్ల బుడ్డోడిని గెలకకుండా ఉండి ఉంటే, ఈ రోజు ఫైనల్లో లంకపై ఇంతటి దావాగ్నిలా విరుచుకుపడేవాడు కాదేమోనంటూ గవాస్కర్ చురకలు అంటించారు. అనవసరంగా కవ్వించి భారత పులిని నిద్రలేపారనే అర్థంలో ఆయన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Never ever touch the ego of 15 years boy #VaibhavSuryavanshi pic.twitter.com/iX8J5LLVGS
— sᴜʀʏᴀᴺᵀᴿ (@BowsterVibes) June 21, 2026
ఈ మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ కేవలం 29 బంతుల్లోనే ఏకంగా 94 పరుగులు సాధించి తృటిలో సెంచరీ మార్కును చేజార్చుకున్నాడు. కేవలం 6 పరుగుల దూరంలో అవుట్ అయినప్పటికీ, అతడి ఇన్నింగ్స్ చూసి లంక క్రికెటర్లు నోరెళ్లబెట్టారు. ఈ విధ్వంసకర ఇన్నింగ్స్లో మొత్తం 8 సిక్సర్లు, 10 ఫోర్లు ఉన్నాయి. అతడి స్ట్రైక్ రేట్ ఏకంగా 325 కి పైగా నమోదు కావడం విశేషం. ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా ఈ యువ క్రికెటర్ పై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..