
Highest T20 Run Chase: దక్షిణాఫ్రికా వర్సెస్ వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన చారిత్రాత్మక టీ20 మ్యాచ్ అభిమానులకు కనువిందు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి ఏకంగా 258 పరుగుల భారీ స్కోరు సాధించింది. విండీస్ బ్యాటర్లలో జాన్సన్ చార్లెస్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 46 బంతుల్లోనే 118 పరుగులు చేసి సంచలనం సృష్టించాడు. అతని ఇన్నింగ్స్లో 10 ఫోర్లు, 11 సిక్సర్లు ఉన్నాయి. అతనికి తోడుగా కైల్ మేయర్స్ 51 పరుగులు, రొమారియో షెపర్డ్ 41 పరుగులతో మెరుపులు మెరిపించడంతో విండీస్ జట్టు కొండంత లక్ష్యాన్ని నిర్దేశించింది.
259 పరుగుల లక్ష్యం అంటే ఏ జట్టుకైనా భయం పుడుతుంది. కానీ దక్షిణాఫ్రికా జట్టు ఏమాత్రం బెదరకుండా బరిలోకి దిగింది. ఓపెనర్ క్వింటన్ డి కాక్ ఆరంభం నుంచే వెస్టిండీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 44 బంతుల్లోనే 100 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. డి కాక్ ఇన్నింగ్స్లో 9 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి. దక్షిణాఫ్రికా బ్యాటర్లు కేవలం 18.5 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి 259 పరుగులు సాధించి, 6 వికెట్ల తేడాతో చారిత్రక విజయాన్ని అందుకున్నారు.
ఈ మ్యాచ్ అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన రన్ చేజ్ (పరుగుల ఛేదన)గా రికార్డు సృష్టించింది. అంతకుముందు ఏ జట్టు కూడా ఇంత భారీ లక్ష్యాన్ని ఛేదించిన దాఖలాలు లేవు. ఈ ఒక్క మ్యాచ్లోనే రెండు జట్లు కలిపి మొత్తం 517 పరుగులు సాధించాయి. ఇది ఒక టీ20 మ్యాచ్లో నమోదైన అత్యధిక పరుగులు కావడం విశేషం. మొత్తం మ్యాచ్లో 46 ఫోర్లు, 35 సిక్సర్లు నమోదయ్యాయి.
వెస్టిండీస్ జట్టు 258 పరుగులు చేసినప్పుడు తమ విజయం ఖాయమని భావించింది. కానీ దక్షిణాఫ్రికా బ్యాటర్లు చేసిన విన్యాసాలకు ప్రపంచ క్రికెట్ విస్తుపోయింది. బౌలర్ల పనితీరు ఎలా ఉన్నా, బ్యాటర్ల వీరవిహారంతో ఈ మ్యాచ్ క్రికెట్ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోయింది. ముఖ్యంగా క్వింటన్ డి కాక్ ఆడిన ఇన్నింగ్స్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. అసాధ్యమని భావించిన రికార్డు పుస్తకాలను ఈ మ్యాచ్ తిరగరాసింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..