IPL 2023: ‘ఐపీఎల్’కు తలనొప్పిగా మారిన దక్షిణాఫ్రికా.. టోర్నీకి పోటీగా వన్డే సిరీస్.. పూర్తి వివరాలివే..
ఈ ఏడాది జరగనున్న వన్డే ప్రపంచకప్కు దక్షిణాఫ్రికా అర్హత సాధించాలంటే ఆ జట్టుకు ఈ సిరీస్ కీలకం. ఈ నేపథ్యంలోనే టీమ్ బోర్డు తన అనుభవజ్ఞులైన ఆటగాళ్లందరికీ సిరీస్ జట్టులో చోటు కల్పించింది. ఫలితంగా ఐపీఎల్లో..
మార్చి 31 నుంచి ఐపీఎల్ 16వ సీజన్ ప్రారంభం కానుంది. ఇదే రోజున దక్షిణాఫ్రికా, నెదర్లాండ్ జట్ల మధ్య వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. దీంతో ఈ వన్డే సిరీస్ ఐపీఎల్లోని కొన్ని జట్లకు పెద్ద తల నొప్పిగా మారింది. అవును, అదెలా అంటే.. ఈ ఏడాది జరగనున్న వన్డే ప్రపంచకప్కు దక్షిణాఫ్రికా అర్హత సాధించాలంటే ఆ జట్టుకు ఈ సిరీస్ కీలకం. ఈ నేపథ్యంలోనే టీమ్ బోర్డు తన అనుభవజ్ఞులైన ఆటగాళ్లందరికీ సిరీస్ జట్టులో చోటు కల్పించింది. ఫలితంగా ఐపీఎల్లో కీలకమైన ఆటగాళ్లు టోర్నీలోని కొన్ని మ్యాచ్లకు దూరం కానున్నారు. ఇదే ఇప్పుడు ఐపీఎల్ టీమ్లను కలవరపెడుతుంది. వాస్తవానికి దక్షిణాఫ్రికా, నెదర్లాండ్ జట్ల మధ్య వన్డే సిరీస్.. ఐపీఎల్ ప్రారంభం కాకముందే ముగిసిపోవలసింది. కానీ అలా జరగలేదు. ఫలితంగా రెండు మ్యాచ్ల సిరీస్లో మొదటి వన్డే మార్చి 31న, అలాగే రెండో వన్డే ఏప్రిల్ 2న జరగనుంది. ఇక ఈ రెండు మ్యాచ్లు ఆడిన తర్వాత దక్షిణాఫ్రికా ఆటగాళ్లు ఐపీఎల్లో చేరగలరు.
దక్షిణాఫ్రికా, నెదర్లాండ్ వన్డే సిరీస్ ఈ జట్లకు తలనోప్పి..
అహ్మదాబాద్ వేదికగా డిఫెండింగ్ చాంపియన్స్ గుజరాత్ టైటాన్స్, 4 సార్లు టోర్నీ విజేతగా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఐపీఎల్ తొలి మ్యాచ్ జరగనుంది. అయితే గుజరాత్ జట్టులో వెటరన్ సౌతాఫ్రికా బ్యాట్స్మ్యాన్ డేవిడ్ మిల్లర్ ఉన్నాడు. అతను లేకపోతే గుజరాత్ టీమ్కు నష్టమే. ఎందుకంటే గత సీజన్లో గుజరాత్ టైటిల్ గెలవడంలో మిల్లర్ పెద్ద పాత్ర పోషించాడు. అలాగే రెండో మ్యాచ్ పంజాబ్ కింగ్స్, కోల్కతా నైట్ రైడర్స్ మధ్య ఏప్రిల్ 1న జరగనుంది. దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ కగిసో రబడ పంజాబ్లో ఉన్నాడు. దీంతో దక్షిణాఫ్రికా, నెదర్లాండ్ వన్డే సిరీస్ పంజాబ్ జట్టుకు కూడా తలనొప్పి అని చెప్పుకోవాలి. ఆపై మూడో మ్యాచ్ లక్నో సూపర్జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరగనుంది. దక్షిణాఫ్రికా ఓపెనర్ క్వింటన్ డికాక్ లక్నోలో ఉండగా, ఫాస్ట్ బౌలర్లు ఎన్రిక్ నోర్కియా, లుంగి అంగిడి ఢిల్లీలో ఉన్నారు. అంటే ఈ నాలుగు జట్లకు దక్షిణాఫ్రికా, నెదర్లాండ్ వన్డే సిరీస్ నష్టదాయకంగా మారింది. ఇంకా పైన పేర్కొన్న ఆటగాళ్లందరికీ కూడా నెదర్లాండ్స్తో జరిగే సిరీస్లో చోటు దక్కింది.
కాగా, దక్షిణాఫ్రికా ఆటగాళ్లు ఏప్రిల్ 3న భారత్కు చేరుకుని తమ తమ ఐపీఎల్ టీమ్లలో చేరే అవకాశం ఉంది. సన్రైజర్స్ హైదరాబాద్కు ఐడెన్ మార్క్రామ్ కెప్టెన్గా వ్యవహరిస్తుండగా, ఈ జట్టులో దక్షిణాఫ్రికాకు చెందిన హెన్రిచ్ క్లాసెన్, మార్కో జాన్సన్ ఉన్నారు. నెదర్లాండ్స్తో జరిగే సిరీస్ దక్షిణాఫ్రికాకు చాలా ముఖ్యమైనది కాబట్టి, క్రికెట్ సౌతాఫ్రికా కఠినమైన నిర్ణయం తీసుకుంది. నెదర్లాండ్స్ సిరీస్లో తమ ఆటగాళ్లు ఆడడాన్ని తప్పనిసరి చేసింది.