
Smriti Mandhana : భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ ప్లేయర్ స్మృతి మంధన్నా ప్రస్తుతం ఇండోర్లో ఉంది. అక్కడ భారత్ నేడు ఇంగ్లండ్తో ఒక కీలకమైన ప్రపంచ కప్ మ్యాచ్ ఆడనుంది. దీనికి ముందు స్మృతి మంధన్నా ఇండోర్ కోడలిగా మారబోతోందనే వార్త వచ్చింది. ఈ వార్తపై స్వయంగా స్మృతి మంధన్నాతో పెళ్లి వార్తలు వినిపిస్తున్న పలాష్ ముచ్చల్ కన్ఫాం చేశారు. విరాట్ కోహ్లీ, యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్ వంటి చాలా మంది క్రికెటర్లు బాలీవుడ్కు చెందిన ప్రముఖులను వివాహం చేసుకున్నారు. కానీ ఈసారి వధువు క్రికెట్ ప్రపంచం నుండి, వరుడు బాలీవుడ్ నుండి వస్తున్నారు. సినీ నిర్మాత, గాయకుడు పలాష్ ముచ్చల్ తమ బంధంపై బహిరంగంగా మాట్లాడటంతో, వారి పెళ్లి వార్తలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
పలాష్ ముచ్చల్తో స్మృతి మంధానా సంబంధం గురించి ఇంతకుముందు నుండి ఊహాగానాలు నడుస్తున్నాయి. అయితే, వారి బంధంపై బహిరంగంగా ఒక ఖచ్చితమైన వార్త రావడం ఇదే మొదటిసారి. డిష్కియాన్, భూతనాథ్ రిటర్న్స్ వంటి చిత్రాలకు సంగీతం అందించిన 30 ఏళ్ల పలాష్, స్మృతి మంధానా మధ్య 2019 నుండి డేటింగ్ జరుగుతోందనే వార్తలు వినిపిస్తున్నాయి.
న్యూస్ ఏజెన్సీల ద్వారా అందిన సమాచారం ప్రకారం.. పలాష్ ముచ్చల్ స్వయంగా ఈ బంధాన్ని ధృవీకరించారు. స్టార్ క్రికెటర్ స్మృతి మంధానా త్వరలో ఇండోర్ కోడలిగా మారబోతుందని ఆయన చెప్పారు. కాగా, స్మృతి మంధానా ప్రస్తుతం ఇండోర్లోనే ఉంది. ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో నేడు భారత మహిళా జట్టు ఐసీసీ మహిళా ODI ప్రపంచ కప్ 2025లో తమ 5వ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ ఇంగ్లండ్తో జరుగుతుంది.
ప్రపంచ కప్లో తొలి రెండు మ్యాచ్లలో శ్రీలంక, పాకిస్థాన్లను ఓడించిన తర్వాత, భారత మహిళా జట్టు వరుసగా 2 మ్యాచ్లలో ఓడిపోయి కష్టాల్లో ఉంది. టీమిండియాను సౌత్ ఆఫ్రికా, ఆ తర్వాత ఆస్ట్రేలియా ఓడించాయి. ఈ కీలక మ్యాచ్ సమయంలోనే స్మృతి మంధానా వ్యక్తిగత జీవితం గురించిన ఈ ఆసక్తికరమైన వార్త వెలుగులోకి వచ్చింది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..