
దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం (Dubai International Cricket Stadium) వేదికగా ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో భారత ఓపెనింగ్ ద్వయం వీరవిహారం చేసింది. షఫాలీ వర్మ కేవలం 39 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 68 పరుగులు సాధించగా, స్మృతి మంధాన 39 బంతుల్లో 59 పరుగులు చేసి లంక బౌలింగ్ను కకావికలం చేశారు. మొదటి వికెట్కు ఏకంగా 129 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని జోడించిన తరువాత చాముడి ప్రబోధ (Chamudi Praboda) బౌలింగ్లో షఫాలీ పెవిలియన్ చేరింది. ఆ వెంటనే దురదృష్టవశాత్తూ రనౌట్ రూపంలో మంధాన కూడా వెనుదిరిగింది. అయినప్పటికీ ఈ జోడీ నెలకొల్పిన 129 పరుగుల భాగస్వామ్యమే మహిళల టీ20 ఆసియా కప్ చరిత్రలో ఏ వికెట్కైనా నమోదైన అత్యున్నత రికార్డుగా నిలిచింది. గతంలో 2022లో యూఏఈపై జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ జోడించిన 128 పరుగుల రికార్డు తెరమరుగైంది.
ఈ మ్యాచ్లో షఫాలీ వర్మ కేవలం 24 బంతుల్లోనే తన అర్ధశతకాన్ని బాది టోర్నీ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ రికార్డును సొంతం చేసుకుంది. గతంలో 2022లో లంకపైనే స్మృతి మంధాన 25 బంతుల్లో చేసిన వేగవంతమైన ఫిఫ్టీ రికార్డును షఫాలీ అధిగమించింది.
తాజా టోర్నీలో షఫాలీ మొత్తం 236 పరుగులు రాబట్టి ఒకే ఆసియా కప్ ఎడిషన్లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్గా అగ్రపీఠాన్ని దక్కించుకుంది. 2016లో మిథాలీ రాజ్ (Mithali Raj) నమోదు చేసిన 220 పరుగుల రికార్డును షఫాలీ దాటేసింది. ప్రస్తుత ఎడిషన్లో మంధాన సైతం 213 పరుగులు చేసి ఈ జాబితాలో నిలిచింది.
మరోవైపు అంతర్జాతీయ మహిళల క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో కలిపి స్మృతి మంధాన 94వ సారి 50 అంతకంటే ఎక్కువ పరుగులు నమోదు చేసింది. 93 సార్లు ఈ ఘనత సాధించిన భారత మాజీ దిగ్గజం మిథాలీ రాజ్ రికార్డును మంధాన అధిగమించి ప్రపంచంలోనే అగ్రస్థానానికి చేరుకుంది. ఇంగ్లండ్ దిగ్గజం షార్లెట్ ఎడ్వర్డ్స్ (Charlotte Edwards) 80 సార్లతో మూడో స్థానంలో ఉంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..