
Sikandar Raza Praises Vaibhav Sooryavanshi: భారత్, జింబాబ్వే మధ్య జూలై 23 నుంచి హరారే వేదికగా ప్రారంభం కానున్న టీ20 సిరీస్కు ముందు జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 15 ఏళ్ల భారత యువ బ్యాటింగ్ సంచలనం వైభవ్ సూర్యవంశీపై ప్రశంసల వర్షం కురిపించిన ఆయన, సరిగ్గా ప్రోత్సహిస్తే వైభవ్ ఒక తరానికి గుర్తుండిపోయే గొప్ప ఆటగాడిగా ఎదుగుతాడని ధీమా వ్యక్తం చేశాడు.
ఇటీవల ముగిసిన ఇంగ్లాండ్ పర్యటనలో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన వైభవ్ సూర్యవంశీ, 3 మ్యాచ్ల్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. దీనిపై విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో జింబాబ్వే ఆల్రౌండర్ సికిందర్ రజా ఆ యువ ఆటగాడికి మద్దతుగా నిలిచాడు.
ఇదికూడా చదవండి: టీమిండియా పరువు తీశారుగా.. ఆ ఒక్కడిని పక్కనపెట్టి పెద్ద తప్పు చేశారయ్యా గంభీర్..!
“వైభవ్ అపారమైన ప్రతిభ కలిగిన ఆటగాడు. కేవలం 15 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ స్థాయికి చేరుకోవడం సాధారణ విషయం కాదు. రెండు మూడు మ్యాచ్లలో సరిగ్గా ఆడలేదని అతడిని విమర్శించడం ఏమాత్రం సమంజసం కాదు. అతడికి భారత జట్టులో మంచి సీనియర్ ఆటగాళ్ల మార్గదర్శకత్వం ఉందనేది మర్చిపోకూడదు” అని రజా పేర్కొన్నాడు.
వైభవ్ భవిష్యత్తు గురించి మాట్లాడుతుంటే రజా ఎంతో ఉత్సాహంగా కనిపించాడు. “భారత క్రికెట్ యాజమాన్యం, సెలెక్టర్లు వైభవ్ను సరిగ్గా నిర్వహించి, సరైన అవకాశాలు ఇస్తే అతడు ఈ తరానికి ఒక అరుదైన కిరణంగా మారతాడు. పదిహేనేళ్ల వయసులో భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడటం, అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో 80 బంతుల్లోనే 175 పరుగులు సాధించడం వంటి అద్భుతాలు అందరికీ సాధ్యం కావు” అని వ్యాఖ్యానించాడు.
ఇదికూడా చదవండి: ఆల్రౌండర్ మోజులో అసలైన వికెట్ టేకర్ బలి.. భారత్ కొంపముంచుతోన్న గంభీర్ మొండి పట్టుదల
ఇటీవలి కాలంలో ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతూ అత్యధిక పరుగులు సాధించి అతి పిన్న వయసులోనే ఆరెంజ్ క్యాప్ కైవసం చేసుకున్న చరిత్ర వైభవ్ది. ఆ విధ్వంసకర ఇన్నింగ్స్లు ఆయనలోని ప్రతిభకు నిదర్శనమని రజా గుర్తుచేశాడు.
ఈ ఏడాది ఆరంభంలో హరారే మైదానంలోనే జరిగిన అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో ఇంగ్లాండ్పై 175 పరుగులతో వైభవ్ విరుచుకుపడ్డాడు. మళ్లీ అదే వేదికపై భారత్ సీనియర్ జట్టు తరఫున బరిలోకి దిగుతుండటంతో ఆయనపై భారీ అంచనాలు ఉన్నాయి.
సంజూ శాంసన్కు ఈ పర్యటన నుంచి విశ్రాంతి ఇవ్వడంతో, అభిషేక్ శర్మతో కలిసి వైభవ్ సూర్యవంశీ ఓపెనర్గా బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది. ఇటీవల ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల్లో ఘోర పరాజయాలను చవిచూసిన భారత జట్టు, శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో ఈ సిరీస్ గెలిచి తీరాలనే పట్టుదలతో ఉంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..