AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sanju Samson: సంజూ ఎంట్రీతో బీసీసీఐ పై వచ్చిన వార్తలన్నీ అబద్ధాలేనా.. బయటపడ్డ అసలు విషయం!

Sanju Samson: అఫ్గానిస్థాన్‌తో సెప్టెంబర్ 13 నుంచి జరగనున్న 3 టీ20ల సిరీస్‌కు భారత జట్టును ప్రకటించడంతో స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శామ్సన్ మళ్లీ స్క్వాడ్‌లోకి వచ్చారు. జింబాబ్వే పర్యటనలో ఆయనకు చోటు దక్కకపోవడంపై వచ్చిన అనేక రూమర్లకు, సోషల్ మీడియా వివాదాలకు ఈ పునరాగమనంతో తెరపడింది.

Sanju Samson: సంజూ ఎంట్రీతో బీసీసీఐ పై వచ్చిన వార్తలన్నీ అబద్ధాలేనా.. బయటపడ్డ అసలు విషయం!
Sanju Samson
Rakesh
|

Updated on: Sep 01, 2026 | 8:15 PM

Share

Sanju Samson: భారత్, అఫ్గానిస్థాన్ జట్ల మధ్య సెప్టెంబర్ 13 నుంచి 3 మ్యాచ్‌ల టి20 సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ కోసం సెలెక్టర్లు దాదాపు మెయిన్ ప్లేయర్లతో కూడిన 15 మంది సభ్యుల పవర్ఫుల్ జట్టును ఎంపిక చేశారు. శ్రేయస్ అయ్యర్ నాయకత్వం వహించనున్న ఈ జట్టులో అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, సంజూ శామ్సన్ మళ్లీ స్థానం సంపాదించుకోవడం. ఈశాన్ కిషన్‌తో పాటు ఆయనను స్పెషలిస్ట్ వికెట్ కీపర్‌గా జట్టులోకి తీసుకున్నారు.

జింబాబ్వే పర్యటనకు ఎంపిక చేసిన జట్టులో సంజూ శామ్సన్ పేరు లేకపోవడంతో సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. సంజూ పట్ల జట్టు యాజమాన్యం అన్యాయంగా వ్యవహరిస్తోందని, ఆయనను జట్టు నుంచి తొలగించారని పలువురు మాజీ క్రికెటర్లు, అభిమానులు ఆరోపణలు చేశారు. అయితే ఆ సమయంలోనే బీసీసీఐ వర్గాలు స్పందిస్తూ ఆయనను జట్టు నుంచి తప్పించలేదని, బిజీ షెడ్యూల్ కారణంగా పనిభారాన్ని తగ్గించేందుకే విశ్రాంతినిచ్చామని స్పష్టం చేశాయి. ఇప్పుడు అఫ్గానిస్థాన్ సిరీస్‌కు ఆయనను నేరుగా ఎంపిక చేయడంతో బోర్డు చెప్పిన మాట నిజమేనని రుజువైంది.

జింబాబ్వే పర్యటన నుంచి శామ్సన్‌కు విశ్రాంతి ఇవ్వడానికి ఆయన పాత యూకే టూర్ ప్రదర్శన కూడా ఒక కారణంగా నిలిచింది. ఐర్లాండ్‌తో జరిగిన 2 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఆయన కేవలం 5 పరుగులు మాత్రమే చేశారు. అందులో ఒక ఇన్నింగ్స్‌లో పరుగులేమీ చేయకుండానే అవుట్ అయ్యారు. ఇక ఇంగ్లండ్ పర్యటనలోని 5 మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో ఆయనకు కేవలం 2 మ్యాచ్‌లలోనే అవకాశం లభించగా, మొదటి మ్యాచ్‌లో 1 పరుగు, చివరి మ్యాచ్‌లో 27 పరుగులు మాత్రమే చేయగలిగారు. మిగిలిన మ్యాచ్‌లలో ఆయన స్థానంలో యంగ్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీని తుది జట్టులోకి తీసుకున్నారు.

నిరాశపరిచిన యూకే పర్యటన తర్వాత లభించిన చిన్నపాటి విరామం సంజూ శామ్సన్‌కు మానసికంగా రీఛార్జ్ అవ్వడానికి ఎంతో ఉపయోగపడింది. ఆ విరామం తర్వాత ఇప్పుడు ఆయన మరింత పట్టుదలతో, పూర్తి ఆత్మవిశ్వాసంతో భారత జట్టులోకి అడుగుపెడుతున్నారు. అఫ్గాన్‌తో జరిగే సిరీస్‌లో తన సత్తా చాటడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. సంజూ శామ్సన్ ఎంపికపై చెలరేగిన అనవసర రగడకు బీసీసీఐ తన నిర్ణయంతో సరైన జవాబు ఇచ్చింది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అఫ్గాన్ సిరీస్‌లో శామ్సన్ ఎలాంటి విధ్వంసం సృష్టిస్తారో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us