RR vs CSK: గువహటిలో పరుగుల జాతరే.. తొలిసారి 200+ రికార్డ్ స్కోర్ లోడింగ్..?

RR vs CSK: ఐపీఎల్ 2026లో మరో హై-వోల్టేజ్ పోరుకు వేదిక సిద్ధమైంది. గువహటిలోని బర్సపరా స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి. సంజూ శాంసన్, రవీంద్ర జడేజా వంటి స్టార్ ఆటగాళ్ల జట్లు మారడంతో ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ మైదానంలో ఇప్పటివరకు నమోదు కాని 200 పరుగుల మార్కును ఈసారి ఈ రెండు జట్లు అందుకుంటాయా లేదా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

RR vs CSK: గువహటిలో పరుగుల జాతరే.. తొలిసారి 200+ రికార్డ్ స్కోర్ లోడింగ్..?
Barsapara Stadium

Updated on: Mar 30, 2026 | 5:00 PM

Guwahati witness first ever 200+ score in IPL?: ఐపీఎల్ తొలి సీజన్ ఫైనలిస్టులైన రాజస్థాన్ రాయల్స్ (RR), చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మధ్య వైరం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే, ఈసారి సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. ఐపీఎల్ చరిత్రలోనే భారీ ట్రేడ్ ద్వారా రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ చెన్నై గూటికి చేరగా, చెన్నై వెటరన్ స్టార్ రవీంద్ర జడేజా రాయల్స్ జెర్సీని ధరించిన సంగతి తెలిసిందే. గత సీజన్‌లో పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచిన ఈ రెండు జట్లు, ఈసారి ఎలాగైనా శుభారంభం చేయాలని పట్టుదలతో కనిపిస్తున్నాయి.

టాస్ గెలిచిన వారికే విజయావకాశాలా..?

ప్రస్తుత సీజన్ ట్రెండ్ చూస్తుంటే టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. మొదటి రెండు మ్యాచ్‌ల్లో ఆర్‌సీబీ, ముంబై ఇండియన్స్ జట్లు 200 పైచిలుకు లక్ష్యాలను సునాయాసంగా ఛేదించాయి. బర్సపరా స్టేడియంలో ఇప్పటివరకు జరిగిన 6 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో మొదట బ్యాటింగ్ చేసిన జట్టు మూడుసార్లు, ఛేజింగ్ చేసిన జట్టు రెండుసార్లు గెలిచాయి. ఒక మ్యాచ్ ఫలితం తేలలేదు. రాత్రి వేళ మంచు కురిసే అవకాశం ఉండటంతో రెండోసారి బ్యాటింగ్ చేసే జట్టుకు అదనపు ప్రయోజనం కలగవచ్చు.

బర్సపరా పిచ్ రిపోర్ట్: పరుగుల వరద పారనుందా..?

గువహటి పిచ్ సాధారణంగా బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ సగటు రన్ రేట్ 8.56గా ఉంది. ఈ మైదానంలో ఇప్పటివరకు అత్యధిక స్కోరు 199/4 (రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్, 2023). అంటే, ఇక్కడ ఇప్పటివరకు ఒక్కసారి కూడా 200 పరుగుల మార్కు నమోదు కాలేదు.

ప్రస్తుత సీజన్‌లో ఆడిన నాలుగు జట్లు (SRH, RCB, MI, KKR) ఇప్పటికే 200 ప్లస్ స్కోర్లు సాధించాయి. రాజస్థాన్ జట్టులో వండర్ బాయ్ వైభవ్ సూర్యవంశీ, చెన్నై జట్టులో భీకర ఫామ్‌లో ఉన్న సంజూ శాంసన్ వంటి హార్డ్ హిట్టర్లు ఉండటంతో, ఈ రాత్రి గువహటి స్టేడియంలో తొలిసారి 200 పరుగుల రికార్డు నమోదయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

జట్ల బలాబలాలు..

రాజస్థాన్ రాయల్స్ జట్టుకు గువహటి రెండో హోమ్ గ్రౌండ్. ఇక్కడ వరుసగా మూడు మ్యాచ్‌లు ఆడిన తర్వాత జైపూర్‌కు ఫిప్ట్ అవుతుంది. రవీంద్ర జడేజా, సామ్ కరన్ వంటి ఆల్ రౌండర్లతో రాజస్థాన్ పటిష్టంగా కనిపిస్తుండగా, రుతురాజ్ గైక్వాడ్ నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ తనదైన శైలిలో సత్తా చాటాలని చూస్తోంది. గాయాల సమస్యలు వేధిస్తున్నప్పటికీ, బ్యాటింగ్ లోతు ఉండటం సీఎస్‌కేకు కలిసొచ్చే అంశం. ఏది ఏమైనా, క్రికెట్ అభిమానులకు ఈ రాత్రి సిక్సర్ల విందు ఖాయమనిపిస్తోంది.

Loading...
Unable to load recommendations.
Follow Us