Rohit Sharma : చివరి మ్యాచ్‌లో చారిత్రాత్మక రికార్డు.. కోహ్లీతో కలిసి సరికొత్త చరిత్ర సృష్టించనున్న రోహిత్

Rohit Sharma : లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరగనున్న మూడో వన్డే రోహిత్ శర్మకు చివరి మ్యాచ్‌గా మారే అవకాశం కనిపిస్తోంది. ఇదే మ్యాచ్‌లో విరాట్ కోహ్లీతో కలిసి 400 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన తొలి భారత జోడీగా హిట్‌మ్యాన్ సరికొత్త చరిత్ర సృష్టించనున్నాడు.

Rohit Sharma : చివరి మ్యాచ్‌లో చారిత్రాత్మక రికార్డు.. కోహ్లీతో కలిసి సరికొత్త చరిత్ర సృష్టించనున్న రోహిత్
Rohit Sharma

Updated on: Jul 17, 2026 | 3:11 PM

Rohit Sharma : భారత క్రికెట్ ప్రపంచంలో ఒక సంచలన మార్పునకు సమయం ఆసన్నమైంది. టీమిండియా స్టార్ ఓపెనర్, రికార్డుల వీరుడు రోహిత్ శర్మ అంతర్జాతీయ వన్డే కెరీర్ ముగింపు దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. జూలై 19న లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్‌తో జరగబోయే మూడో వన్డే మ్యాచ్.. భారత్ తరఫున హిట్ మ్యాన్ ఆడే ఆఖరి వన్డే మ్యాచ్ కానుందని క్రీడా వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ప్రస్తుతం ఫామ్ లేమితో సతమతమవుతున్న 41 ఏళ్ల రోహిత్ శర్మను, సెలక్టర్లు ఇకపై జట్టులో కొనసాగించేలా లేరని స్పష్టమవుతోంది.

ప్రస్తుతం భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న వన్డే సిరీస్ ఉత్కంఠభరితంగా మారింది. మొదటి వన్డేలో టీమిండియా భారీ విజయం సాధించి శుభారంభం చేయగా, రెండో వన్డేలో హోస్ట్ ఇంగ్లాండ్ జట్టు కార్డిఫ్ వేదికగా పుంజుకుని 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో సిరీస్ ఇప్పుడు 1-1 తో సమమైంది. ఇప్పుడు సిరీస్ విజేతను నిర్ణయించే ఆఖరి పోరు లార్డ్స్ మైదానానికి చేరింది. అయితే ఈ మ్యాచ్ ఫలితం కంటే కూడా, ఇది రోహిత్ శర్మకు ఆఖరి మ్యాచ్ కానుందనే వార్తలతో అందరి దృష్టి అతని ప్రదర్శనపైనే నెలకొంది.

ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రకారం.. బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ స్వయంగా రోహిత్ శర్మతో మాట్లాడి భవిష్యత్తు ప్రణాళికలను వివరించినట్లు తెలుస్తోంది. 2027 వన్డే ప్రపంచకప్ రోడ్‌మ్యాప్‌లో రోహిత్ శర్మ పేరు లేదని సెలక్టర్లు స్పష్టం చేశారు. ఈ ఇంగ్లాండ్ పర్యటన ముగిసిన తర్వాత వన్డే జట్టులో మార్పులు ఉంటాయని, రోహిత్ స్థానంలో యువ ఆటగాళ్లకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. అయితే ఈ నిర్ణయంపై రోహిత్ శర్మ తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఐపీఎల్ 2026 సీజన్‌లో హ్యామ్‌స్ట్రింగ్ గాయం కారణంగా ఎక్కువ మ్యాచ్‌లకు దూరమైన రోహిత్, ఇటీవల తన ఫిట్‌నెస్‌పై ఎంతగానో శ్రమించి పునరాగమనం చేశాడు. అయినప్పటికీ సెలక్టర్లు అతని రిటైర్మెంట్ నిర్ణయాన్ని అతనికే వదిలేస్తూ పక్కన పెట్టాలని ఫిక్స్ అయ్యారు.

41 ఏళ్ల వయసులో ఫిట్‌నెస్ సమస్యలు రావడం సహజమే అయినా, సెలక్టర్లు మెయిన్‌గా రోహిత్ ఫామ్ గురించే ఆందోళన చెందుతున్నారు. 2025లో అద్భుతంగా రాణించిన హిట్ మ్యాన్, 2026లో మాత్రం ఘోరంగా విఫలమయ్యాడు. ఈ ఏడాది అతను ఆడిన 8 వన్డే ఇన్నింగ్స్‌లలో కేవలం 241 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో అతని యావరేజ్ 30 కాగా, స్ట్రైక్ రేట్ 88.6 గా నమోదైంది. ప్రస్తుత ఇంగ్లాండ్ సిరీస్‌లోనూ రెండు వన్డేలు కలిపి కేవలం 37 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. ఈ పేలవమైన గణాంకాలే అతని కెరీర్‌ను ముగించేలా సెలక్టర్లపై ఒత్తిడి తెచ్చాయి.

ఇది కూడా చదవండి : Rohit Sharma : ఆటే కాదు కామెడీ కూడా మస్త్ పండిస్తాడు.. రోహిత్ వన్-మ్యాన్ షో చేసిన టాప్ 5 ప్రెస్ కాన్ఫరెన్స్‌లివే

తన కెరీర్‌లో ఆఖరి మ్యాచ్ కాబోతున్న లార్డ్స్ వన్డేలో రోహిత్ శర్మ ఒక అరుదైన, అద్భుతమైన ప్రపంచ రికార్డును అందుకోబోతున్నాడు. రోహిత్ శర్మ, రన్ మెషీన్ విరాట్ కోహ్లీ కలిసి అంతర్జాతీయ క్రికెట్‌లో 400 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న తొలి భారతీయ జోడీగా సరికొత్త చరిత్ర సృష్టించనున్నారు. ఇప్పటివరకు భారతదేశం తరఫున ఏ ఇద్దరు ఆటగాళ్లు కూడా ఈ మైలురాయిని అందుకోలేదు. రోహిత్ తన కెరీర్ ముగింపు మ్యాచ్‌ను తన సుదీర్ఘకాలపు సహచరుడు విరాట్‌తో కలిసి ఇలాంటి అద్భుత రికార్డుతో ముగించనుండటం నిజంగా ఒక క్రికెట్ కావ్యం లాంటిదని చెప్పవచ్చు.

భారత్ తరఫున చూస్తే ఇప్పటివరకు అత్యధికంగా సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్ జోడీ కలిసి 391 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి రెండో స్థానంలో ఉన్నారు. ఇప్పుడు రోహిత్-విరాట్ జోడీ 400 మ్యాచ్‌ల క్లబ్‌లో చేరి అగ్రస్థానాన్ని కైవసం చేసుకోనుంది. ఇక ప్రపంచ క్రికెట్ చరిత్రను పరిశీలిస్తే.. శ్రీలంక లెజెండ్స్ మహేల జయవర్ధనే, కుమార సంగక్కర జోడీ ఏకంగా 550 అంతర్జాతీయ మ్యాచ్‌లు కలిసి ఆడి ఆల్ టైమ్ గ్లోబల్ రికార్డ్‌తో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. వారి రికార్డు అందుకోవడం అసాధ్యమైనా, భారత క్రికెట్‌లో మాత్రం రోహిత్-కోహ్లీల జోడీ చెరిపేయలేని ముద్ర వేసింది.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us