
Mumbai Indians vs Gujarat Titans: ఏప్రిల్ 12న బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో రోహిత్ శర్మ తొడకండరాల గాయానికి గురయ్యాడు. దీంతో ఆయన జట్టుకు అందుబాటులో ఉంటాడా లేదా అన్నది ఉత్కంఠగా మారింది. అయితే, ఆదివారం నాడు నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన శిక్షణా శిబిరంలో రోహిత్ అందరికంటే ముందుగా హాజరై బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయడం గమనార్హం. ఆయన ఫామ్ చూస్తుంటే గాయం నుంచి వేగంగా కోలుకుంటున్నట్లు కనిపిస్తోంది. అయినప్పటికీ, మ్యాచ్కు ముందు ఫిట్నెస్ పరీక్షలో నెగ్గితేనే తుది జట్టులో అవకాశం దక్కుతుంది.
ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా కూడా ఫిట్నెస్ సమస్యలతో సతమతమవుతున్నాడు. ఈ సీజన్లో ఇప్పటికే కొన్ని మ్యాచ్లకు దూరమైన ఆయన, రాబోయే మరికొన్ని మ్యాచ్లకు కూడా అందుబాటులో ఉండకపోవచ్చని సమాచారం. హార్దిక్ లేని పక్షంలో సూర్యకుమార్ యాదవ్ తాత్కాలిక కెప్టెన్గా బాధ్యతలు నిర్వహించనున్నాడు. మరోవైపు ఇంగ్లాండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్ ఇంకా జట్టుతో కలవకపోవడం ముంబై జట్టును కలవరపెడుతోంది.
ప్రస్తుత సీజన్ ముంబై ఇండియన్స్కు అస్సలు కలిసిరావడం లేదు. ఆడిన ఐదు మ్యాచ్ల్లో కేవలం ఒకే ఒక విజయాన్ని నమోదు చేసిన ఆ జట్టు, వరుసగా నాలుగు ఓటములతో పాయింట్ల పట్టికలో చివరి స్థానానికి పడిపోయింది. రాజస్థాన్ రాయల్స్పై కోల్కతా విజయం సాధించడంతో ముంబై పరిస్థితి మరింత దిగజారింది. టోర్నమెంట్లో ముందడుగు వేయాలంటే గుజరాత్తో జరిగే మ్యాచ్లో ముంబై కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
రోహిత్ శర్మ ఆడటంపై జట్టు మేనేజ్మెంట్ ఇంకా స్పష్టమైన ప్రకటన చేయలేదు. 39 ఏళ్ల వయసులో ఉన్న రోహిత్ విషయంలో ఎటువంటి రిస్క్ తీసుకోకూడదని యాజమాన్యం భావిస్తోంది. సోమవారం మ్యాచ్ ప్రారంభానికి కొద్దిసేపటి ముందు మాత్రమే ఆయన ఆడటంపై తుది నిర్ణయం తీసుకోనున్నాడు. ముంబై అభిమానులు మాత్రం తమ అభిమాన ఆటగాడు మైదానంలోకి దిగి జట్టును గెలిపించాలని కోరుకుంటున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..