
భారత క్రికెట్ వన్డే సారథ్య బాధ్యతలను రోహిత్ శర్మ నుంచి యువ సంచలనం శుభ్మన్ గిల్కు అప్పగిస్తూ బీసీసీఐ తీసుకున్న నిర్ణయం క్రికెట్ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. ముఖ్యంగా రోహిత్ కెప్టెన్సీలో భారత్ ఇటీవలే ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన నేపథ్యంలో ఈ మార్పు చర్చనీయాంశమైంది. అయితే, ఈ కెప్టెన్సీ మార్పు ప్రకటించిన వెంటనే సోషల్ మీడియాలో ఒక పాత ట్వీట్ సంచలనం సృష్టిస్తోంది. ఈ ట్వీట్ చేసింది మరెవరో కాదు, మాజీ వన్డే కెప్టెన్ రోహిత్ శర్మనే..!
రోహిత్ శర్మ సరిగ్గా 13 ఏళ్ల క్రితం, సెప్టెంబర్ 14, 2012న తన X (గతంలో ట్విట్టర్) ఖాతాలో ఒక పోస్ట్ చేశాడు. అందులో ఆయన కేవలం రెండు లైన్లలో ఇలా రాశారు: “End of an era (45) and the start of a new one (77).” (ఒక శకం ముగింపు (45), కొత్త శకం ప్రారంభం (77)) అంటూ అందులో పేర్కొన్నాడు.
సాధారణంగా ఈ ట్వీట్ రోహిత్ తన జెర్సీ నంబర్కు సంబంధించినదిగా అప్పట్లో భావించారు. ఎందుకంటే రోహిత్ శర్మ జెర్సీ నంబర్ 45. అప్పట్లో ఆయన 77 నంబర్ జెర్సీ ధరించడం గురించే ఈ ట్వీట్ అని కొందరు అనుకున్నారు.
End of an era (45) and the start of a new one (77) ….. http://t.co/sJI0UIKm
— Rohit Sharma (@ImRo45) September 14, 2012
45: ఇది రోహిత్ శర్మ జెర్సీ నంబర్. ఆయన కెప్టెన్సీ శకం ముగియడాన్ని ఇది సూచిస్తోంది.
77: ఇది కొత్తగా వన్డే కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన శుభ్మన్ గిల్ జెర్సీ నంబర్!
13 ఏళ్ల క్రితం, శుభ్మన్ గిల్ అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టకముందే (అసలు క్రికెట్లోనే అంత పేరు సంపాదించకముందే), రోహిత్ శర్మ చేసిన ఈ ట్వీట్.. సరిగ్గా ఇప్పుడు కెప్టెన్సీ మార్పునకు అన్వయించడం అభిమానులను ఆశ్చర్యానికి, కొంత భయానికి కూడా గురిచేసింది.
సోషల్ మీడియా వినియోగదారులు రోహిత్ను ‘అంతర్యామి’ అని, ‘టైమ్ ట్రావెలర్’ అని వ్యాఖ్యానిస్తున్నారు. “రోహిత్కు భవిష్యత్తు ముందే తెలుసు” అని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. క్రికెట్ విశ్లేషకులు కూడా ఈ అద్భుతమైన యాదృచ్ఛికాన్ని చూసి అవాక్కవుతున్నారు. ఇది కేవలం యాదృచ్ఛికమే అయినప్పటికీ, భారత క్రికెట్లో ఒక శకం ముగిసి, మరొక యువ సారథి శకం ప్రారంభానికి రోహిత్ పాత ట్వీట్ ఒక వైరల్ చిహ్నంగా మారింది.
2027 ప్రపంచ కప్ కోసం భారత జట్టు సన్నాహాలు ప్రారంభించగానే, కొత్త నాయకత్వాన్ని తీసుకురావాల్సిన సమయం ఆసన్నమైందని సెలెక్టర్లు నిర్ణయించారు. భారత జట్టు ఆస్ట్రేలియాలో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను ఆడనుంది. అక్టోబర్ 19న పెర్త్లో ప్రారంభమవుతుంది. రెండవ మ్యాచ్ అక్టోబర్ 23న అడిలైడ్లో, చివరి మ్యాచ్ అక్టోబర్ 25న సిడ్నీలో జరగనుంది.
రోహిత్ శర్మ వన్డేల్లో తాత్కాలిక కెప్టెన్గా తన కెప్టెన్సీ ప్రయాణాన్ని ప్రారంభించాడు. విరాట్ కోహ్లీ లేనప్పుడు 2017 శ్రీలంక పర్యటనలో అతను మొదట జట్టుకు నాయకత్వం వహించాడు. ఆ తరువాత భారత జట్టు 2018 ఆసియా కప్ టైటిల్ను స్టాండ్-ఇన్ కెప్టెన్గా గెలిపించాడు. కోహ్లీ స్థానంలో అతనికి అధికారికంగా పూర్తి సమయం కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు.
అతని పదవీకాలంలో భారత జట్టు అనేక కీలక విజయాలను సాధించింది. 2023లో శ్రీలంకలో జరిగిన ఆసియా కప్ను భారత జట్టు గెలుచుకుంది. అదే సంవత్సరం వన్డే ప్రపంచ కప్ ఫైనల్కు చేరుకుంది. కానీ ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. అయితే, రోహిత్ భారత జట్టును 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి నడిపించాడు.
2017 నుంచి 2025 వరకు తన వన్డే పదవీకాలంలో, రోహిత్ 56 మ్యాచ్లకు నాయకత్వం వహించాడు. 42 గెలిచి 12 మ్యాచ్ ల్లో మాత్రమే ఓడిపోయాడు. ఒక టై, ఒక మ్యాచ్ ఫలితం లేకుండా పోయింది. 75 శాతం విజయ రేటుతో, అతను ఆధునిక యుగంలో భారత జట్టులో అత్యంత ప్రభావవంతమైన వైట్-బాల్ లీడర్లలో ఒకడిగా పేరుగాంచాడు.
ఈ సంవత్సరం ప్రారంభంలో, శుభ్మాన్ గిల్ ఇంగ్లాండ్లో జరిగిన ఐదు టెస్ట్ల సిరీస్ను 2-2తో డ్రాగా ముగించాడు. ఇటీవల స్వదేశంలో ముగిసిన తొలి టెస్ట్లో వెస్టిండీస్పై ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో విజయానికి ఆయన నాయకత్వం వహించాడు.
గిల్ ఐపీఎల్లో నాయకత్వ అనుభవాన్ని కూడా పొందాడు. గత రెండు సీజన్లలో గుజరాత్ టైటాన్స్ (జిటి) జట్టుకు నాయకత్వం వహించాడు. అతను 27 మ్యాచ్ల్లో 14 విజయాలు సాధించాడు. 2027 ప్రపంచ కప్ కోసం జట్టును నిర్మించే లక్ష్యంతో భారత 50 ఓవర్ల జట్టుకు నాయకత్వం వహించడానికి ఈ అనుభవం అతనికి సహాయపడుతుంది.
25 ఏళ్ల ఈ ఆటగాడు 55 వన్డేల్లో 59.04 సగటుతో 2,775 పరుగులు చేశాడు. అందులో ఒక డబుల్ సెంచరీ, ఏడు సెంచరీలు ఉన్నాయి. ఆస్ట్రేలియాపై ఎనిమిది ఇన్నింగ్స్లలో ఒక సెంచరీ, ఒక అర్ధ సెంచరీతో సహా 280 పరుగులు చేసిన అతనికి మంచి ట్రాక్ రికార్డ్ కూడా ఉంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..