
Team India Vice Captain: భారత టెస్టు జట్టులో త్వరలోనే ఒక పెద్ద మార్పు చోటుచేసుకోబోతోంది. ఆఫ్ఘనిస్తాన్తో జరగబోయే ఏకైక టెస్టు మ్యాచ్, వన్డే సిరీస్ కోసం గౌహతిలో జాతీయ సెలక్టర్లు సమావేశం కానున్నారు. ఈ భేటీలో రిషభ్ పంత్ భవిష్యత్తు నాయకత్వ బాధ్యతలపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. సుదీర్ఘ ఫార్మాట్లో జట్టుకు వెన్నుముకలా నిలిచే పంత్ను వైస్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి విముక్తుడిని చేసి, అతడు కేవలం బ్యాటింగ్పైనే పూర్తి దృష్టి పెట్టేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తున్న రిషభ్ పంత్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాడు. గత రెండు సీజన్లుగా కెప్టెన్సీ ఒత్తిడి కారణంగా అతడి సహజసిద్ధమైన దూకుడు బ్యాటింగ్ మందగించిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అటు వ్యూహాత్మకంగా కూడా పంత్ కొన్ని పొరపాట్లు చేసినట్లు బోర్డు పెద్దలు భావిస్తున్నారు. గత ఏడాది నవంబర్లో దక్షిణాఫ్రికాతో జరిగిన ఒక టెస్టు మ్యాచ్లో శుభ్మన్ గిల్ అందుబాటులో లేని సమయంలో పంత్ జట్టును నడిపించాడు. అయితే, ఆ మ్యాచ్లో అతడి కెప్టెన్సీ నిర్ణయాలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి.
“భారత క్రికెట్ జట్టు రిషభ్ పంత్ లాంటి మ్యాచ్ విన్నర్ను ఎట్టి పరిస్థితుల్లోనూ కోల్పోవడానికి సిద్ధంగా లేదు. ఒంటరి పోరాటంతో టెస్టు మ్యాచ్లను గెలిపించే సత్తా అతడికి ఉంది. అయితే అదనపు బాధ్యతలు అప్పగించినప్పుడు బ్యాటింగ్లో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాడనే భావన ఉంది. అతడు స్వేచ్ఛగా ఆడేందుకే ఈ నిర్ణయం తీసుకోబోతున్నారు” అని బీసీసీఐ అధికారిక వర్గాలు తెలిపాయి.
పంత్ ప్రస్తుత ఫామ్ సెలక్షన్ కమిటీకి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. వన్డే ఫార్మాట్లో కేఎల్ రాహుల్ తర్వాత రెండో వికెట్ కీపర్ స్థానం కోసం తీవ్రమైన పోటీ నెలకొంది. సంజూ శాంసన్, ధ్రువ్ జురెల్, ఇషాన్ కిషన్ లాంటి యువ ఆటగాళ్లు అద్భుతమైన ఫామ్లో ఉండటంతో 50 ఓవర్ల ఫార్మాట్లో పంత్ తన స్థానాన్ని కాపాడుకోవాలంటే బ్యాట్తో అద్భుతాలు చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది.
ఆఫ్ఘనిస్తాన్ సిరీస్లో స్టార్ పేసర్ జస్ప్రీత్ బూమ్రా అందుబాటుపై కూడా సెలక్టర్లు చర్చించనున్నారు. ఐపీఎల్ ముగిసిన వెంటనే బూమ్రా వర్క్లోడ్ను బీసీసీఐ వైద్య బృందం పరిశీలిస్తుంది. మెడికల్ టీమ్ అనుమతి ఇస్తే అతడు ఆఫ్ఘనిస్తాన్తో జరిగే ఏకైక టెస్టు మ్యాచ్లో బరిలోకి దిగుతాడు. అయితే, వన్డే సిరీస్కు మాత్రం అతడికి పూర్తిగా విశ్రాంతి ఇవ్వనున్నారు. ఒకవేళ ఏ చిన్న శారీరక సమస్య ఉన్నా, పూర్తి సిరీస్ నుంచే బూమ్రాకు రెస్ట్ ఇచ్చే అవకాశం ఉంది.
భారత క్రికెట్ జట్టు భవిష్యత్తు ప్రయోజనాల దృష్ట్యా రిషభ్ పంత్ను ఒత్తిడి లేని ఆటగాడిగా ఉంచడమే అత్యంత ఉత్తమమైన మార్గమని సెలక్టర్లు భావిస్తున్నారు. నాయకత్వ బాధ్యతల కంటే పంత్ అందించే పరుగులే జట్టుకు ఎంతో అవసరమని బీసీసీఐ నమ్ముతోంది. ఈ కీలక మార్పుపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..