Ranji Trophy 2021: ఒకే గ్రూపులో తలపడనున్న రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ టీంలు.. జనవరి 5 నుంచి పోరు షురూ..!

|

Aug 31, 2021 | 9:31 AM

రంజీ ట్రోఫీ 2022 జనవరి 5 నుంచి ప్రారంభం కానుంది. 2020 సంవత్సరంలో, రంజీ ట్రోఫీని కరోనా కారణంగా నిర్వహించలేకపోయారు.

Ranji Trophy 2021: ఒకే గ్రూపులో తలపడనున్న రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ టీంలు.. జనవరి 5 నుంచి పోరు షురూ..!
Ranji Trophy
Follow us on

Ranji Trophy 2021: కరోనా తర్వాత తొలిసారిగా రంజీ ట్రోఫీ కోసం ప్రకటన వెల్లడైంది. ఇందులో పాల్గొనే జట్లను వేర్వేరు గ్రూపులుగా విభజించారు. ఇందులో ఆరు గ్రూపులు తలపడనున్నాయి. ఐదు గ్రూపులలో ఎలైట్ జట్లు ఉంటాయి. కొత్త, పాత జట్లతో 2022లో రంజీ ట్రోఫీ రసవత్తరంగా మారనుంది. రంజీ ట్రోఫీ 2022 జనవరి 5 నుంచి ప్రారంభం కానుంది. 2020 సంవత్సరంలో, రంజీ ట్రోఫీని కరోనా కారణంగా నిర్వహించలేకపోయారు. ఈ సంవత్సరం కూడా ఈ టోర్నమెంట్ జరగలేదు. రంజీ ట్రోఫీ 2021 చివరిలో ప్రారంభం కావాల్సి ఉంది. కానీ, తర్వాత షెడ్యూల్‌లో మార్పు చేశారు. దీంతో జనవరి నుంచి రంజీ ట్రోఫీ ప్రారంభంకానుంది.

ముంబై, కర్ణాటక, ఢిల్లీ వంటి పెద్ద జట్లు ఈసారి ఒకే సమూహంలో తలపడనున్నాయి. పీటీఐ ప్రకారం, ఈ మూడు టీంలు ఎలైట్ గ్రూప్ సీ లో ఉన్నాయి. దీనిని గ్రూప్ ఆఫ్ డెత్ అంటారు. ముంబై, కర్ణాటక, ఢిల్లీతో పాటు, హైదరాబాద్, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్ కూడా ఈ గ్రూపులో ఉన్నాయి. ఉత్తరాఖండ్ కొద్దిగా బలహీనంగా కనిపిస్తోంది. కానీ, మిగిలిన ఐదు జట్లు చాలా బలంగా ఉన్నాయి. వీటిలో ఢిల్లీ, ముంబై, కర్ణాటక అనేక సార్లు రంజీ ట్రోఫీని కూడా గెలుచుకున్నాయి. శిఖర్ ధావన్, రిషబ్ పంత్, నవదీప్ సైనీ వంటి టీమిండియా ప్లేయర్లు ఢిల్లీ జట్టులో ఆడుతుండగా, పృథ్వీ షా, సూర్యకుమార్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, రోహిత్ శర్మ, అజింక్య రహానే, శ్రేయస్ అయ్యర్‌లు ముంబైలో ఆడనున్నారు. అదే సమయంలో కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, కరుణ్ నాయర్, దేవదత్ పాడికల్ వంటి ఆటగాళ్లు కర్ణాటక తరపున ఆడనున్నారు.

మిగతా గ్రూప్‌ల పరిస్థితి ఎలా ఉందంటే..
గుజరాత్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, సర్వీసెస్, అస్సాం టీంలు ఎలైట్ గ్రూప్ ఏలో ఉన్నాయి. గుజరాత్, పంజాబ్‌లదే పైచేయిలా కనిపిస్తోంది. అయినప్పటికీ ఈ గ్రూప్ కూడా చాలా బలమైన జట్లతో నిండిపోయింది. ఎలైట్ గ్రూప్ బీలో చివరిసారి రన్నరప్ జట్టు బెంగాల్, విదర్భ, హర్యానా, కేరళ, త్రిపుర, రాజస్థాన్‌లాంటి జట్లు తలపడనున్నాయి. ఇక్కడ ఏ ఒక్క జట్టు కూడా బలంగా కనిపించడం లేదు. ఎందుకంటే విదర్భతో పాటు, రాజస్థాన్ కూడా రంజీ ఛాంపియన్‌గా నిలిచింది. బెంగాల్-హర్యానా కూడా బలమైన జట్లుగానే బరిలోకి దిగనున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్స్ సౌరాష్ట్ర, తమిళనాడు, రైల్వేస్, జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్, గోవా టీంలు ఎలైట్ గ్రూప్ డిలో చోటు దక్కించుకున్నాయి. సౌరాష్ట్రతో పాటు, తమిళనాడు ఇందులో బలమైన జట్టు.

ఆరు నగరాల్లో గ్రూప్ మ్యాచ్‌లు..
ఎలైట్ గ్రూప్ ఈ లో ఆంధ్ర, ఉత్తర ప్రదేశ్, బరోడా, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, పాండిచ్చేరి జట్లు ఉంటాయి. ప్లేట్ గ్రూప్‌లో చండీగఢ్, మేఘాలయ, బీహార్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ జట్లు ఉన్నాయి. ఈసారి రంజీ ట్రోఫీ ఆరు నగరాల్లో నిర్వహించనున్నారు. దీని కింద, ప్రతి సమూహానికి ఒక నగరం వచ్చింది. అన్ని మ్యాచ్‌లు అక్కడే జరుగుతాయి. ఎలైట్ ఏ గ్రూప్ ముంబై, ఎలైట్ బీ గ్రూప్ బెంగళూరు, ఎలైట్ సీ గ్రూప్ కోల్‌కతా, ఎలైట్ డీ గ్రూప్ అహ్మదాబాద్, ఎలైట్ ఈ గ్రూప్ త్రివేండ్రం, ప్లేట్ గ్రూప్ మ్యాచ్‌లు చెన్నైలో జరుగుతాయి. ప్రతి మ్యాచ్ తర్వాత ఐదు రోజుల క్వారంటైన్ గ్యాప్ ఉండనుంది.

Also Read: ‘ముందుండి నడిపించడం కాదు.. మిగతా వారి నుంచి అత్యుత్తమ ఆటను రాబట్టండి’: కోహ్లీకి మాజీ కోచ్ సూచన

జట్టు నుంచి తొలగించిన వ్యక్తి ఇప్పుడు విరాట్ కోహ్లీకి బాస్‌ అయ్యాడు..! అతడు ఎవరో తెలుసా..?