ఐసీసీ వరల్డ్ కప్ 2019లో భాగంగా ఇంగ్లాండ్తో ఆదివారం రాత్రి బర్మింగ్హామ్ వేదికగా జరిగిన మ్యాచ్లో భారత్ జట్టు 31 పరుగుల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. టోర్నీలో ఐదో విజయాన్ని అందుకున్న ఇంగ్లాండ్ జట్టు 10 పాయింట్లతో సెమీస్ అవకాశాల్ని సజీవంగా ఉంచుకోగా.. ఈ మ్యాచ్లో ఓడినప్పటికీ భారత్ జట్టుకు సెమీస్ దారులు ఇంకా తెరిచే ఉన్నాయి. ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా భారత్ సెమీస్ చేరాలంటే చివరి రెండు మ్యాచ్ల్లో కనీసం ఒక్కదాంట్లో గెలవాలి. మరోవైపు ఇంగ్లాండ్ చేతిలో టీమిండియా ఓటమి.. పాక్ సెమీస్ అవకాశాల్ని దారుణంగా దెబ్బతీసింది. పాకిస్థాన్ 9 పాయింట్లతో ఐదో స్థానానికి పడిపోయింది. ఈ రెండు జట్లకీ ఇక చెరొక మ్యాచ్ మిగిలి ఉంది. ఇప్పుడు పాకిస్థాన్ సెమీస్ చేరాలంటే.. చివరి మ్యాచ్లో బంగ్లాదేశ్ని తప్పకుండా ఓడించాలి. మరోవైపు న్యూజిలాండ్ చేతిలో ఇంగ్లాండ్ జట్టు తన ఆఖరి మ్యాచ్లో ఓడిపోవాలని కోరుకోవాలి. భారత్ చేతిలో ఒకవేళ ఆదివారం ఇంగ్లాండ్ ఓడిపోయుంటే.. అప్పుడు బంగ్లాదేశ్పై గెలిచి అలవోకగా సెమీస్ చేరే అవకాశం పాక్కి ఉండేది. ఇంగ్లాండ్ ఆఖరి మ్యాచ్ ఫలితం గురించి కంగారు పడాల్సిన అవసరం ఉండేది కాదు.